చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8లో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలోని సొంత మైదానం చిదంబరం స్టేడియంలో మంగళవారం ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో ఆ జట్టు 2 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ను మట్టికరిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోరు మాత్రమే సాధించినప్పటికీ ఆ తర్వాత కోల్కతా నైట్రైడర్స్ను సమర్ధవంతంగా ప్రతిఘటించి 2 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకూ 7 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్కు ఇది ఆరో విజయం. దీంతో ఆ జట్టు మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లి.. రాజస్థాన్ రాయల్స్ (11 పాయింట్లు)ను కిందికి నెట్టింది. అంతకుముందు టాస్ గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు డ్వెన్ స్మిత్, బ్రెండన్ మెక్కలమ్ 42 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
అనంతరం మెక్కలమ్ (19) పియూష్ చావ్లా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా నిష్క్రమించాడు. అతని వచ్చిన సురేష్ రైనాతో కలసి రెండో వికెట్కు మరో 22 పరుగులు జోడించిన స్మిత్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. కొద్దిసేపటికి రైనా (17) ఆండ్రూ రసెల్ బౌలింగ్లో వికెట్ల వెనుక రాబిన్ ఉతప్పకు దొరికిపోయాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 67 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ తరుణంలో ఫఫ్ డుప్లెసిస్ క్రీజ్లో నిలదొక్కుకుని స్థిమితంగా ఆడినప్పటికీ మిగిలిన బ్యాట్స్మన్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (3), డ్వెన్ బ్రావో (5) స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు పరుగు తీయగా, రవీంద్ర జడేజా (15) బ్రాడ్ హాగ్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
డుప్లెసిస్ (29), రవిచంద్రన్ అశ్విన్ (9) నాటౌట్గా నిలువడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లలో ఆండ్రూ రసెల్, పియూష్ చావ్లా రెండేసి వికెట్లు రాబట్టగా, బ్రాడ్ హాగ్ ఒక వికెట్ అందుకున్నాడు.
అనంతరం 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు తొలి ఓవర్లోనే కెప్టెన్ గౌతమ్ గంభీర్ (0) వికెట్ను చేజార్చుకుంది. అయితే కొద్దిసేపు ఎడాపెడా షాట్లతో విజృంభించిన ఓపెనర్ రాబిన్ ఉతప్ప (39) రెండో వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి నిష్క్రమించాడు.
ఆ తర్వాత ర్యాన్ టెన్ దస్కాటే (38 నాటౌట్) ఒంటరి పోరాటం సాగించినప్పటికీ మనీష్ పాండే (15), సూర్య కుమార్ యాదవ్ (16), యూసుఫ్ పఠాన్ (13), ఆండ్రూ రసెల్ (4), ప్యాట్ కమిన్స్ (0), పియూష్ చావ్లా (0), ఉమేష్ యాదవ్ (0) వరుసగా పెవిలియన్కు పరుగు తీశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే సాధించిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకూ 7 మ్యాచ్లు ఆడిన నైట్రైడర్స్కు ఇది మూడో ఓటమి.