CSK VS RCB: ఐపీఎల్ 2025 సీజన్ ను ఘనంగా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ హోరాహోరీ పోరులో ఇరు జట్లు గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఎంత మంది ఆటగాళ్లు ఉన్నా అందరి కళ్లు ధోనీ, కోహ్లీపైనే ఉన్నాయి. ధోనీ ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడా, కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తాడా అని అభిమానులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
అతడు ప్రమాదకరంగా...
ముఖ్యంగా కోహ్లీ గత రెండు దశాబ్దాలుగా ఒకే జట్టు తరఫున ఆడుతూ, ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. గత మ్యాచులో కేకేఆర్ పై 59* పరుగులు చేశాడు. దీంతో మ్యాచుకు ముందు "కోహ్లీ అసాధారణమైన ఫామ్ మీకు సవాల్ గా, ప్రమాదంగా మారనుందా?" అన్న ప్రశ్నకు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ బలమైన సమాధానం చెప్పాడు.

ఆ ఇద్దరిని దెబ్బ కొడితే..
"ఒక్క మ్యాచ్ ఆడగానే ఇటువంటి విషయాలపై ఓ అంచనాకు రాకూడదు. గత సీజన్ తో పోలిస్తే ఇప్పడు ఆర్సీబీ, సీఎస్కే కాస్త వేరుగా ఉంది. కాబట్టి గత ప్రదర్శనల ఆధారంగా మనం అంచనాలు వేయకూడదు. ఆర్సీబీ లైనప్ చూస్తుంటే కోహ్లీ కీలకంగా వ్యవహరిస్తాడని అనిపిస్తోంది. కానీ వాళ్ల జట్టులో ఇంకా బలమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇతర ఫ్రాంఛైజీలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఈ సీజన్ మరింత పోటీ ఉంటుందని అనుకుంటున్నాను. కోహ్లీ అసాధారణమైన ఫామ్ తో పాటు ఆ జట్టులో ఇతర డేంజరెస్ బ్యాటర్లు కూడా ఉన్నారు. కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్ ను కంట్రోల్ చేయాలి. వారిద్దరిని కట్టడి చేస్తే మాకు విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి" అని అన్నాడు.