టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబెను చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కొనియాడాడు. దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్తో దూబెను పోల్చాడు. బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి దూబె ఎంతో అంకితం భావంతో ఉంటాడని ఫ్లెమింగ్ అన్నాడు. ఐపీఎల్లో దూబె సీఎస్కే తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సీజన్లో దూబె కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేశాడు. కానీ ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో దూబె బంతితో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అతడు 13 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడే ఈ లెఫ్ట్ హ్యాండర్ను సెలక్టర్లు టీ20 వరల్డ్ కప్కు సెలక్ట్ చేసిన విషయం తెలిసిందే.

''దూబె బౌలింగ్ గురించి చెప్పాలంటే అతడు కపిల్ దేవ్ లాంటి వ్యక్తి. అతను ఎంతో శ్రమిస్తున్నాడు. ఐపీఎల్లో కష్టపడ్డాడు. అయితే మా జట్టులో ఎంతో మంది ఆల్రౌండర్లు ఉన్నారు. దాంతోపాటు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో ఉంది. దీంతో అతను బౌలింగ్ చేయలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్రౌండర్లకు, బ్యాటింగ్తో సత్తా చాటుతూ పార్ట్ టైమ్ బౌలింగ్ చేసే ప్లేయర్లపై ప్రభావం చూపించింది''
''దూబె బౌలింగ్ కోసం శ్రమిస్తూ భారాన్ని పెంచుకుంటున్నాడు. సరైన పరిస్థితుల్లో అతను కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అయితే స్లో కండిషన్స్లో అతని వేగం వైవిధ్యం, కట్టర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. జట్టులో అతని బాధ్యతలను పూర్తి చేయగలడు'' అని ఫ్లెమింగ్ అన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్ సిరీస్లో సత్తాచాటిన దూబె సెలక్టర్లను ఆకర్షించాడు. ఐపీఎల్-2024 మొదటి అర్ధభాగంలోనూ బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు.
ఈ ప్రదర్శనతో దూబె టీ20 వరల్డ్ కప్కు భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే టీమిండియాను ప్రకటించిన తర్వాత దూబె ఫామ్ కోల్పోవడం గమనార్హం. ఐపీఎల్ సెకండాఫ్లో రెండు సార్లు డకౌటయ్యాడు. 7, 18, 21 పరుగులతో నిరాశపరిచాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లోనూ బ్యాటింగ్లో విఫలమయ్యాడు. 14 పరుగులే చేశాడు.