మరో నెలన్నర రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరనుంది. టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రిషభ్ పంత్తో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్, జితేశ్ శర్మ పోటీపడుతున్నారు. అయితే తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటే ఆ స్థానం ఎంఎస్ ధోనీదే అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు.
42 ఏళ్ల ధోనీ ఏ రీతిలో చెలరేగుతున్నాడని చెప్పడానికి ఈ ఉదాహరణ ఒకటి చాలు. వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏ మాత్రం పదును తగ్గదని ఐపీఎల్-2024లో నిరూపిస్తున్నాడు. ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్లతో జట్టుకు కీలక పరుగులు సాధిస్తున్నాడు. అంతేగాక ఈ సీజన్లో ఒక్కసారి కూడా ధోనీ ఔట్ కాకపోవడం విశేషం. 34 బంతుల్లో 87 పరుగులు సాధించాడు.

లక్నో వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ధోనీ 9 బంతుల్లో అజేయంగా 28 పరుగులు చేశాడు. సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్రేటుతో బ్యాటింగ్ చేశాడు.అయితే ఈ సీజన్లో ధోనీ చివరి రెండు మూడు ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్కు వస్తున్నాడు. ధోనీ కాస్త ముందుగా బ్యాటింగ్కు వస్తే జట్టుకు భారీ స్కోరుతో పాటు అభిమానులకు కానుకలా ఉంటుందని కొందరి వాదన. దీనిపై సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్ స్పందించాడు.
''సీజన్ ప్రారంభం ముందు నుంచి ధోనీ మంచి లయలో ఉన్నాడు. అందుకే అతని ప్రదర్శన పట్ల జట్టు ఆశ్చర్యపోవట్లేదు. గత సీజన్లలో ధోనీ మోకాలి సమస్యతో ఉన్నాడు. ఇప్పుడు కోలుకుంటున్నాడు. అందుకే సత్తాచాటుతున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ ధోనీని ఎక్కువసేపు క్రీజులో చూడాలనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం చేస్తున్నది సరైనదే. అతడు మాకు టోర్నమెంట్ చివరి వరకు కావాలి''
''ఆఖర్లో రెండు మూడు ఓవర్లలో అతని రాక ప్రత్యేకంగా ఉంది. మా జట్టును మంచి స్థితిలో ఉంచే బాధ్యత ఇతర బ్యాటర్లపై ఉంది. దాన్ని ధోనీ మరింత ముందుకు తీసుకెళ్తాడు. ప్రతీ సందర్భంలో అతను అదరగొడుతున్నాడు. ఇది కనుల పండువగా ఉంది'' అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.