భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కార్లు, బైక్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే తన గ్యారేజ్లో అనేక వింటేజ్ కార్లు, బైకులు ఉన్నాయి. కార్లు, బైక్లు పెట్టుకోవడానికి ధోని ఓ గ్యారేజ్నే మెయింటేన్ చేస్తున్నాడంటే అతనికి అవి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా ధోని గ్యారేజ్లో మరో వింటేజ్ ల్యాండ్ రోవర్ కారు చేరింది. గత నెలలో గురుగ్రామ్లో బిగ్ బాయ్ టాయ్జ్ (బీబీటీ) అనే షోరూం సంస్థ వేలం నిర్వహించింది.
ఆ వేలంలో అనేక మంది ప్రముఖులతో పోటీ పడి మరి 1970 మోడల్కు చెందిన ల్యాండ్ రోవర్ 3 సిరీస్ కారును ధోని సొంతం చేసుకున్నాడు. ఈ విషయన్ని కారు వేలం నిర్వహించిన షోరూం తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో ధోని ఇలాకాలో మరో ల్యాండ్ రోవర్ కారు చేరబోతుందన్న మాట. ఇది చూసి ధోని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇది భారతదేశంలోని అరుదైన కార్లలో ఒకటిగా పేరు గాంచింది. అంతేకాకుండా ఆటో మొబైల్ రంగంలో ఈ కారుకు ప్రత్యేక స్థానం ఉంది. 1970 నుంచి 1985 మధ్య దేశంలో ఈ కార్లను తయారు చేశారు. అప్పట్లో ఈ కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉండేది.
ఈ కారు ఇంజన్ సామర్థ్యం 2.25 లీటర్లుగా ఉంది. అంతేకాకుండా మాన్యవల్ ట్రాన్స్ మిషన్తో నడుస్తుంది. ఆన్లైన్ ద్వారా 50 శాతానికిపైగా స్టాక్ను విక్రయిస్తున్నట్లు బీబీటీ షోరూం ప్రకటించింది. ఆన్లైన్ వేలంలో రోల్స్ రాయిస్, కాడిలాక్స్, బ్యూక్స్, చేవ్రొలెట్స్, ల్యాండ్ రోవర్స్, ఆస్టిన్, మెర్సిడెస్ వంటి 19 కార్లు అమ్మకానికి పెట్టినట్లు సదరు షోరూం వెల్లడించింది.
2019లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో కూడా ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. అయితే నాయకత్వ బాధ్యతల నుంచి మాత్రం తప్పుకున్నాడు. కెప్టెన్గా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వ్యవహరించనున్నాడు. దీంతో చెన్నై జట్టులో ధోని తొలి సారి సారథిగా కాకుండా సాధారణ ఆటగాడిగా ఆడబోతున్నాడు. కాగా ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది ఐపీఎల్ ట్రోఫీని నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరి 13, 14వ తేదీల్లో జరగనుంది.