
నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చివరి ఓవర్లో హైడ్రామా జరిగింది. చివరి ఓవర్లో ఢిల్లీ 36పరుగులు చేయాల్సిన పరిస్థితి.. అప్పుడు రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెక్కాయ్ బౌలింగ్కు దిగాడు. క్రీజులో ఢిల్లీ ఆల్రౌండర్ రోవ్మెన్ పావెల్ ఉన్నాడు. మెక్కాయ్ వేసిన మొదటి బంతికి పావెల్ కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. రెండో బంతికి కూడా పావెల్ సిక్సుతో బదులిచ్చాడు. దీంతో సమీకరణం 4బంతులకు 24పరుగులకు చేరుకుంది. పావెల్ విరుచుకుపడుతుండడంతో బౌలర్ మెక్కాయ్ బౌలింగ్లో లయ తప్పాడు. తడబాటుకు గురయ్యాడు. ఈ క్రమంలో మూడో బంతిని ఫుల్ టాస్గా విసిరాడు. దాన్ని కూడా పావెల్ గుంజి కొట్టడంతో బంతి స్టాండ్స్లో పడింది. వరుసగా ఢిల్లీకి మూడు సిక్సర్లు రావడంతో 3బంతుల్లో 18పరుగులు మాత్రమే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఇక్కడే వివాదం రాజుకుంది. మూడో బంతి ఫుల్ టాస్.. బ్యాటర్ నడుము కంటే ఎత్తులో పడింది. కానీ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం దాన్ని నోబాల్గా ప్రకటించలేదు. డగౌట్లో కూర్చున్న ఢిల్లీ టీం అది నోబాల్.. నోబాల్.. అంటూ చేతితో సైగలు చేస్తూ అరిచారు. అలాగే పావెల్ సైతం అంపైర్ వద్దకు వెళ్లి.. నా నడుము కంటే ఎత్తులో వచ్చింది అది కంప్లీట్ నోబాల్.. మీరు నోబాల్ ఇవ్వాలంటూ అంపైర్తో వాదించాడు. కానీ నితిన్ మీనన్ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. అది ఫెయిర్ డెలివరీగానే పరిగణించాడు.
దీంతో డగౌట్లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. ఇంకా ఆడాల్సిన అవసరం లేదు పావెల్.. వచ్చేసేయ్ అంటూ డగౌట్ నుంచి సైగచేశాడు. పావెల్, కుల్దీప్ యాదవ్ సైతం డగౌట్ వైపు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఇంతలో షేన్ వాట్సన్ పంత్ను కూల్ చేయడంతో మళ్లీ పావెల్ క్రీజులోకి వెళ్లాడు. అప్పటికే తన లయ దెబ్బతిన్న పావెల్ తర్వాతి మూడు బంతుల్లో సిక్సర్లు కొట్టలేదు. ఆఖరి బంతికి ఔటయిపోయాడు. దీంతో రాజస్థాన్ గెలిచింది.
అయితే అంపైర్ నితిన్ మీనన్ నోబాల్ ప్రకటించకపోవడంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం అసహనానికి గురయ్యారు. చీటర్ చీటర్ అంటూ స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. స్క్రీన్లో చూశాక కూడా తన నిర్ణయాన్ని నితిన్ మార్చుకోకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చీటర్ అంటూ గోలగోల చేశారు. అలాగే సోషల్ మీడియాలో సైతం చీటర్ అనే ట్యాగ్ ట్రెండింగ్ అయింది.
నితిన్ మీనన్ వరస్ట్ అంపైర్ అని.. ఇలాంటి అంపైర్ ఉంటే ఐపీఎల్ చూడాలంటే కూడా విరక్తి కలుగుతుందని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు అంపైర్.. రిప్లే చూశాక కూడా కళ్లు దొబ్బాయా అంటూ మండిపడుతున్నారు. ఇంకా కొందరు దారుణమైన మీమ్స్తో నితిన్ మీనన్ ను ట్రోల్ చేస్తున్నారు. అసలు అది ఇంతకు నోబాల్ అవునో కాదో అనే విషయాన్ని బీసీసీఐ కానీ, ఐపీఎల్ మేనేజ్ మెంట్ కానీ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.