ఇంగ్లండ్తో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో భారత్ 4-1 తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమిపాలైనప్పటికీ తర్వాత అద్భుతంగా పుంజుకుని టీమిండియా వరుస విజయాలు సాధించింది. జట్టులో ఉన్న వనరులను రోహిత్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయినప్పటికీ రోహిత్ కెప్టెన్సీపై కొందరు అసంతృప్తిగా ఉన్నారని, దానికి గల కారణాలను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ వివరించాడు.
దూకుడైన విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్సీ అందుకోవడంతో భారీ అంచనాలతో విమర్శలు వచ్చాయని నాజర్ హుస్సేన్ అన్నాడు. ఇంగ్లండ్ సిరీస్లో సారథిగా రోహిత్ మంచి మార్కులు సాధించాడని తెలిపాడు. తన కెప్టెన్సీ లోపాలని తెలుసుకుని రోహిత్ సరిదిద్దుకుంటున్నాడని పేర్కొన్నాడు.

''రోహిత్ కెప్టెన్సీలో కొన్నిసార్లు ప్రజలు తికమకపడుతున్నారు. అతనిలో ఎంతో నైపుణ్యం ఉంది. బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడు. కెప్టెన్గా ఇంగ్లండ్ సిరీస్లో గొప్పగా రాణించాడు. తాను నేర్చుకుంటున్నానని, తన స్టైల్లో పరిస్థితులు అర్థం చేసుకుంటున్నాని ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రోహిత్ ఒప్పుకున్నాడు. సిరీస్ ఆరంభంలో రోహిత్ కొత్తబంతిని అశ్విన్కు అందివ్వలేదు. మరోవైపు తన అసలైన ప్రత్యర్థి అయిన అశ్విన్ రాకపోవడంతో ఈలోపు బెన్ డకెట్ 60-70 పరుగులకు చేరుకున్నాడు''
'' కానీ ఈ విషయంలో తనది సరైన వ్యూహం కాదని రోహిత్ తర్వాత తెలుసుకున్నాడు. కొత్తబంతితో మెరిసే బుమ్రా, సిరాజ్ జట్టులో ఉన్నప్పుడు రెండో ఇన్నింగ్స్లో అశ్విన్కు ఛాన్స్ ఇవ్వడం కీలకమైనది. రోహిత్ విషయంలో గందరగోళంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ వచ్చాడు. కోహ్లిది దూకుడు స్వభావం. లార్డ్స్లో ఇంగ్లండ్కు నరకాన్ని చూపిద్దామనుకునూ స్టైల్ కోహ్లిది. రోహిత్ అలాంటి వ్యక్తి కాదు. కానీ, అతని లోపల అగ్నిజ్వాల ఉంది'' అని నాజర్ హుస్సేన్ తెలిపాడు.
2021/22 ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి కెప్టెన్సీని క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు. ప్రత్యర్థి సొంతగడ్డపై ఇంగ్లండ్కు తన దూకుడైన కెప్టెన్సీతో కోహ్లి చుక్కలు చూపించాడు. లార్డ్స్లో ఇంగ్లండ్ ఛేదనకు ముందు టీమిండియాతో కోహ్లి మాట్లాడిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. 'ఈ 50 ఓవర్లు ఇంగ్లండ్ బ్యాటర్లు నరకాన్ని చూడాలి' అని కోహ్లి పేర్కొన్న విషయం తెలిసిందే.