హైదారాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అజ్యింకె రహానే మంగళవారం 29వ పడిలోకి అడుగుపెట్టాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఈ సందర్భంగా రహానేకు టీమిండియా ఆటగాళ్లతో పాటు పలువురు మాజీలు ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్లలో రహానే ఒకడిగా కొనసాగుతున్నాడు. టీమిండియా తరుపున ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్ధుడు. అంతేకాదు టీమిండియా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. రహానే నేతృత్వంలోని టెస్టు జట్టు ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో విజయం సాధించింది.
ఈ టెస్టులో విజయం సాధించడంతో టీమిండియా ఆస్ట్రేలియాపై టెస్టు సిరిస్ను కైవసం చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్లో భాగంగా పాకిస్థాన్తో తలపడింది. ఈ మ్యాచ్లో పాక్పై భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ ఆడిన తుది జట్టులో రహానేకు చోటు దక్కలేదు. రహానే 29వ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.