
హైదరాబాద్: బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్, హైదరాబాద్ మాజీ కెప్టెన్ దివంగత డాక్టర్ ఎంవీ శ్రీధర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన పుస్తకం 'ది రినాస్సాన్స్ మ్యాన్-డాక్టర్ ఎంవీ శ్రీధర్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్న క్లబ్ హజ్లో ఉదయం 11 గంటలకు ఈ పుస్తకాన్ని వీవీఎస్ లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వినోద్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీడర్ షిప్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న గొప్ప వ్యక్తి శ్రీధర్ అని కొనియాడారు.
ఇక, వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఎంవీ శ్రీధర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లక్ష్మణ్ మాట్లాడుతూ "ఆయనపై పుస్తకం రాయడం చాలా గొప్పగా ఆనిపించింది. క్రికెట్ లవర్స్తో పాటు అందరికీ నచ్చుతుంది. చిన్నతనం నుంచి క్రికెటర్ గా ఆయన జర్నీ అందరికీ ఆదర్శం అవుతుంది" అని అన్నారు.

ఈ పుస్తకంలో ముందుమాటను వీవీఎస్ లక్ష్మణ్ రాయగా... అజహరుద్దీన్, అనిల్ కుంబ్లే, వెంకటపతి రాజు, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అనురాగ్ ఠాకూర్ తమ అభిప్రాయాలను జోడించారు. ఈ పుస్తకాన్ని మాజీ రంజీ ప్లేయర్ హరిమోహన్ రాశారు. హరిమోహన్ ఆల్సెయింట్స్ హైస్కూల్ తరఫున శ్రీధర్ ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడే సమయంలో ఆయన జూనియర్.
ఎంవీ శ్రీధర్ జీవిత విశేషాలతో పాటు, అతని నాయకత్వ లక్షణాలు, క్రికెట్ కెరీర్కు సంబంధించిన పలు అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి టీమిండియా మాజీ క్రికెట్లు మహ్మద్ అజహరుద్దీన్, వెంకటపతి రాజులతో పాటు ప్రజ్ఞాన్ ఓజా, ఎంవీ శ్రీధర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.