న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న సురేశ్ రైనా వరల్డ్ కప్ అనంతరం ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సురేశ్ రైనా తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకొనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ 2015 ముగిసిన తర్వాత ఏప్రిల్ 3న వివాహ వేడుక ఉంటుందని రైనా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సురేష్ రైనా చేసుకోబోయే అమ్మాయి, రైనా తల్లి స్నేహితురాలి కుమార్తె అని తెలిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాకముందే సురేష్ రైనా వివాహం చేయాలని రైనా తల్లిదండ్రులు ఆత్రుతగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సురేశ్ రైనా వరల్డ్ కప్ టూర్లో బిజీగా ఉన్నాడు.

శనివారం భారత్-జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన జింబాబ్వేపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. 20 ఓవర్లలో 161 పరుగులు చేయాల్సి ఉండగా, ఏ మాత్రం ఖంగారు పడకుండా ధోని, రైనాలు ఇద్దరూ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. చివరి 10 ఓవర్లలో ధోని, రైనాలు దూకుడుగా ఆడారు.