హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ను పంజాబ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. హర్మన్ బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు రూ. 5 లక్షల చెక్ను అందజేశారు. హర్మన్ను డీఎస్పీగా నియమించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి ఆమె నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని డీజీపీ సురేశ్ అరోరాను సీఎం ఆదేశించారు. మహిళల వరల్డ్కప్లో కౌర్ అద్భుతంగా ఆడిందని, హర్మన్ పంజాబ్ అమ్మాయి కావడం గర్వంగా ఫీలవుతున్నానని, ఆమె ఇక నుంచి పంజాబ్ పోలీస్శాఖలో పని చేస్తుందని ఆయన తెలిపారు.
దీంతో హర్మన్ప్రీత్ కౌర్ త్వరలోనే పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీ బాధ్యతలు చేపట్టనున్నారు. పోలీసుగా పని చేయాలన్నది తన చిన్ననాటి కల నిజమైందని ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం హర్మన్ప్రీత్ మీడియాతో పేర్కొన్నారు. ఆమెను ఉద్యోగంలోకి చేర్చుకున్నాక పోలీస్ శాఖలో మహిళలజట్టును ఏర్పాటు చేస్తామని పంజాబ్ డీజీపీ సురేశ్ అరోరా చెప్పారు.
ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ రైల్వేలో పనిచేస్తోంది. ఇటీవల ముగిసిన మహిళల క్రికెట్ వరల్డ్కప్లో భారత్ ఫైనల్ చేరడంలో హర్మన్ ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆమె ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 115 బంతుల్లోనే 171 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.