
టీడీపీకి ఘాటు రిప్లై..
ఆ సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఆ తరువాత ఆ ట్వీట్ను డిలేట్ చేసింది ఫౌండేషన్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి- నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో ఉన్న నదులన్నీ ఉప్పొంగాయి. అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

తిరుపతికి వరదపోటు..
తీర ప్రాంతాలు, పట్టణాలు, నగరాలను ముంచెత్తాయి. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగింది. మైలవరం రిజర్వాయర్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు జల వనరుల శాఖ అధికారులు. అతి భారీ వర్షాలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గిరుల్లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ వరదపోటుకు గురయ్యాయి. కపిలతీర్థం, మాల్వాడిగుండం, పాపనాశనం.. ఇవన్నీ ఉప్పొంగాయి. వరద నీరంతా తిరుపతి నగర వీధుల్లోకి ప్రవహించింది.

క్రికెటర్ హనుమ విహారి ఫౌండేషన్ సేవలు..
తిరుపతి మొత్తం సగానికి మునిగిపోయింది. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి ఆహారం, ఇతర సౌకర్యాలను అందించడానికి క్రికెటర్ హనమ విహారి ఫౌండేషన్ ముందుకొచ్చింది. వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను అందిస్తోంది. ఈ ఫౌండేషన్కు చెందిన వలంటీర్లు తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ- నిరాశ్రయులకు ఆహారాన్ని, ఇతర సౌకర్యాలను అందిస్తున్నారు.

ఫౌండేషన్ కార్యక్రమాలను వాడేసుకున్న టీడీపీ..
అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఆ ఫౌండేషన్ తరఫున వరద బాధితులకు సహాయ కార్యక్రమాలను అందించడానికి వచ్చిన వలంటీర్లల్లో రవి, లోకేష్ అనే ఇద్దరు యువకులు.. ఎన్టీఆర్ ట్రస్ట్ అనే టీ షర్టును ధరించారు. ఆ టీ షర్టులను ధరించడం తప్పు కాదు. డ్రెస్ కోడ్ ఏదీ లేకపోవడంతో వలంటీర్లంతా తమకు నచ్చిన దుస్తుల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరును ముద్రించిన టీషర్టును ధరించిన రవి, లోకేష్ల ఫొటోలను తెలుగుదేశం పార్టీ వాడేసుకుంది.

భువనేశ్వరి సహాయం చేస్తున్నారంటూ..
ఆ ఇద్దరి ఫొటోలను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేసింది. వరదలో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే అసెంబ్లీలో జగన్ అండ్ కో చంద్రబాబు మీద కక్షతో నారా భువనేశ్వరిని అవమానించారని విమర్శించింది. తనను అసెంబ్లీలో విమర్శిస్తోన్న సమయంలో భువనేశ్వరి ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్.. తిరుపతి వరద బాధితులకు సహాయం చేస్తోందంటూ టీడీపీ పేర్కొంది.

ఎన్టీఆర్ ట్రస్టు టీ షర్టులు వేసుకున్నంత మాత్రాన..
అసలు చిక్కంతా అక్కడే వచ్చింది. రవి, లోకేష్ ఫొటోలు, ఈ కామెంట్స్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే హనుమ విహారి ఫౌండేషన్ స్పందించింది. ఒక వివరణ ఇచ్చింది. 19వ తేదీన తిరుపతిలో జరిగిన సహాయ కార్యక్రమాలకు, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రవి, లోకేష్ అనే ఇద్దరు వలంటీర్లు ఎన్టీఆర్ ట్రస్ట్ టీషర్టులు వేసుకున్నారని, అంతమాత్రాన ఇది తెలుగుదేశం పార్టీ చేపట్టిన సేవా కార్యక్రమాలు కాదని కుండబద్దలు కొట్టింది. కొద్దిసేపటికి హనుమ విహారి ఫౌండేషన్ ఆ ట్వీట్ను డిలేట్ చేసింది. అప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


Click it and Unblock the Notifications












