
హైదరాబాద్: భారత టెస్టు క్రికెట్ జట్టులో సభ్యుడైన పూజారాకు కూతురు పుట్టింది. విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్న పూజారాకు ఈ విషయం తెలియగానే ఆనందంతో పొంగిపోయాడు.
"పాపాయికి స్వాగతం. చాలా ఆనందంగా ఉంది. జీవితంలో మరో కొత్త పాత్ర పోషించబోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. మేము కోరుకున్నదే.. పాప నిజం చేసింది." అని ట్వీట్ చేస్తూ తన భార్య పక్కనుండగా ముద్దుల పాపను ఎత్తుకొని ఉన్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.
ఛతేశ్వర్ పూజారా తండ్రి అర్వింద్ భాయ్ పూజారా తన కుటుంబం సంబరాల్లో మునిగితేలుతుందంటూ పేర్కొన్నాడు. పాప ప్రసవం తర్వాత తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. ఛతేశ్వర్ పూజారాకు పూజాతో 2013లో వివాహమైంది. ఈమె తరచూ పూజారా ఆడుతున్న మ్యాచ్లలో స్టేడియంలో కనిపించేంది.
పూజారాకు 2005లోనే తన తల్లి దూరమైంది. ఆ తర్వాత తండ్రే పెంచి క్రికెటర్ని చేశాడు. క్రికెట్ ఆడేందుకు వివాహం అనంతరం పూజా కూడా పూజారాను బాగా ప్రోత్సహించింది. సెమీస్లో సౌరాష్ట్ర జట్టులో ఆడనున్న పూజారా ఆంధ్రతో పోటీపడనున్నాడు.
పుజారా జనవరి 1నే ఇన్స్టాగ్రామ్లో ఒక చిత్రాన్ని ఉంచి తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ముందుగానే సూచించాడు. ఈ ఏడాది తాము ఒక బుజ్జిపాపను కోరుకుంటున్నామని అందులో పేర్కొన్నాడు. పుజారా దంపతులు తల్లిదండ్రులైన సందర్భంగా మిత్రులు, అభిమానులు అభినందనలు తెలిజేశారు.
అదరగొట్టిన ఆంధ్ర:
అఖిల భారత విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర చరిత్ర సృష్టించింది. దేశవాళీ అత్యున్నత వన్డే క్రికెట్ టోర్నీలో తొలిసారిగా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో ఢిల్లీని చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 32.1 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది.
ఆంధ్ర బౌలర్లు శివకుమార్ (4/29), భార్గవ్ భట్ (3/28), అయ్యప్ప (2/30) విజృంభించి ఢిల్లీని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అనంతరం ఆంధ్ర 28.4 ఓవర్లలో 4 వికెట్లకు 112 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మరో క్వార్టర్స్లో సౌరాష్ట్ర 3 వికెట్ల తేడాతో బరోడాపై విజయం సాధించింది. ఈనెల 25 (ఆదివారం)న జరిగే సెమీస్లో సౌరాష్ట్రతో ఆంధ్ర తలపడుతుంది.