సిడ్నీ: భారత జట్టులో అదృష్టవంతుడైన క్రికెటర్ ఎవరూ అంటే ఠక్కున చెప్పే సమాధానం మహేంద్ర సింగ్ ధోని. అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు తన అదృష్టాన్ని కోల్పోతున్నాడా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 2007లో సీనియర్ల మద్దుతుతో టీమిండియా కెప్టెన్గా కొత్త అవతారం ఎత్తాడు మహేంద్ర సింగ్ ధోని.
ఆ తర్వాత రెండు సంవత్సరాలకు టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకోవడం, ఆ తర్వాత రెండు సంవత్సరాలకు స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ ఓవర్ల ఆటలో ఇప్పటికీ నెంబర్ వన్ ఆటగాడు కెప్టెన్ ధోనియే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంగ్లాదేశ్లో జరిగిన వరల్డ్ ట్వంటీ 20 పైనల్ మ్యాచ్లో శ్రీలంకపై భారత్ గెలుపొందడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. అయితే గురువారం నాడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్టేలియా చేతిలో 95 పరుగుల ఘోర పరాజయాన్ని మాత్రం అభమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
టోర్నమెంట్లో వరుస విజయాలతో దూసుకపోయిన టీమిండియా సెమీ పైనల్ మ్యాచ్లో అభిమానులను నిరాశపర్చడం ఎంత మాత్రం నచ్చడం లేదు. మ్యాచ్ అనంతరం ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఘోర పరాజయం తర్వాత వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు వచ్చిన వార్తలను కెప్టెన్ ధోని ఖండించాడు. వచ్చే ఏడాది ఆ విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

'నాకిప్పుడు 33 ఏళ్లు. ఇప్పటికీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. బహుశా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకుంటా. వచ్చే వన్డే ప్రపంచకప్లో ఆడుతానో లేదో చెబుతాన'ని మహేంద్ర సింగ్ ధోని చెప్పారు.
గత ఏడాది డిసెంబర్లో ఆస్టేలియా పర్యటనలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వన్డే కెరీర్ గురించి స్పష్టమైన ప్రకటన చేస్తానని ప్రకటించాడు. దీంతో గురువారం తన భవిష్యత్ ప్రణాళిక గురించి చెప్పాడు. ఇక ధోనిపై ఆస్టేలియా కెప్టెన్ మైఖెల్ క్లార్క్ స్పందిస్తూ, ధోని శకం ముగియలేదని పేర్కొన్నాడు. అతని శరీరంలో ఇంకా క్రికెట్ ఆడే శక్తి ఉందన్నాడు.
గురువారం జరిగిన సెమీ పైనల్ మ్యాచ్లో ఆస్టేలియా నిర్దేశించిన 328 భారీ పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా, 233 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ఓటమిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లు నిర్లక్ష్యపు ధోరణితో చెత్త షాట్లకు పెవిలియన్కు చేరుకున్నారని మండిపడ్డారు.