
హైదరాబాద్: ఆదివారం మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన ఓ షాట్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ షాట్ను గుర్తుకు తెచ్చిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (140; 113బంతుల్లో 14×4, 3×6) తనదైన బ్యాటింగ్తో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదించిన రోహిత్.. అనంతరం గేర్ మార్చి 85 బంతుల్లోనే సెంచరీ చేసాడు.
ఇక సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. రోహిత్ మైదానం నలుమూలలా షాట్లతో అలరించాడు. రోహిత్ కెరీర్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లో ఇదొకటి. రోహిత్ భారీ సెంచరీతో టీమిండియా 336 పరుగులు చేసింది. అయితే, ఇన్నింగ్స్ 26 ఓవర్ రెండో బంతిని పాక్ బౌలర్ అసన్ అలీ వేయగా.. రోహిత్ అప్పర్కట్ షాట్ ఆడాడు. బంతి కాస్తా స్టాండ్స్లోకి వెళ్లి పడింది.
2003 ప్రపంచకప్లో కూడా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్పై ఇలాంటి షాటే ఆడాడు. అప్పర్కట్ షాట్తో అప్పటి సచిన్ షాట్ను రోహిత్ గుర్తు చేసాడు. దీనికి సంబందించిన వీడియోని ఐసీసీ తన ట్విట్టర్లో షేర్ చేస్తూ సచిన్ టెండూల్కర్ను ట్యాగ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ట్వీట్కు సచిన్ స్పందించాడు.
సచిన్ తన ట్విట్టర్లో "మేమిద్దరం భారతదేశానికి చెందినవాళ్ళం, అంతేకాదు ఇద్దరం ముంబై నుంచే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. కాబట్టి, హెడ్ పడింది నేను గెలిచా.. టెయిల్ పడింది నువ్వు ఓడావ్" అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీని జత చేస్తూ సచిన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.