
హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. దీంతో ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన కరుణరత్నే(52 నాటౌట్) ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసందీంతో వరల్డ్కప్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి చివరి వరకు క్రీజులో ఉండి అజేయంగా నిలిచిన రెండో ఆటగాడిగా కరుణరత్నే అరుదైన గుర్తింపు పొందాడు. అంతకుముందు వెస్టిండీస్ క్రికెటర్ రిడ్లీ జాకబ్స్ ఈ ఘనత సాధించాడు. 1999 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో జాకబ్స్ ఓపెనర్గా వచ్చి నాటౌట్గా నిలిచాడు.
ఆనాటి మ్యాచ్లో జాకబ్స్ 49 పరుగులు మాత్రమే చేయగా, కరుణరత్నే హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు 29.2 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌటైంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ కోల్పోయింది. కివీస్ పేసర్ హెన్రీ బౌలింగ్లో తొలి బంతిని ఫోర్ బాదిన తిరుమానె ఆ తర్వాత రెండో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. హెన్రీ వేసిన రెండో బంతి నేరుగా బ్యాట్స్మన్ ప్యాడ్కి తగిలినప్పటికీ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు.
దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెంటనే రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ పరిశీలించారు. ఈ రివ్యూలో బంతి బ్యాట్కు తాకకపోగా, నేరుగా వెళ్లి స్టంప్స్ను తాకుతున్నట్లు కనిపించడంతో తిరుమానెను ఔట్గా ప్రకటించారు. దీంతో శ్రీలంక నాలుగు పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ పెరీరాతో కలిసి కెప్టెన్ కరుణరత్నే ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. పిచ్ బౌలింగ్కి పూర్తిస్థాయిలో అనుకూలించడంతో కివీస్ పేసర్లు చెలరేగారు. తొమ్మిదో ఓవర్ మొదటి బంతికి కుశాల్ పెరీరా(29) ఔట్ చేసిన హెన్రీ, ఆ మరుసటి బంతికే కుశాల్ మెండిస్ను పెవిలియన్కు పంపాడు.
హెన్రీ దెబ్బకు శ్రీలంక 46 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సెల్వా(4) పరుగుల వద్ద ఫెర్గ్యుసన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇక, ఏంజెలో మాథ్యూస్ డకౌట్ కాగా, జీవన్ మెండిస్(1) పెవిలియన్కు చేరారు. చివర్లో తిషారా పెరీరా(27) రాణించడంతో వంద పరుగుల మార్కుని అందుకుంది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇసురు ఉదనా డౌకట్గా పెవిలియన్కు చేరగా... సురంగ లక్మల్ (7), లసిత్ మలింగ(1) నిరాశపరిచారు. ఇక, న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, లూకీ ఫెర్గ్యుసన్ చెరో మూడు వికెట్లు తీయగా... బౌల్ట్, శాంటర్న్, గ్రాండ్హోమ్, జిమ్మీ నీషమ్ తలో వికెట్ పడగొట్టారు.
10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
కార్డిఫ్ వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 137 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చేధించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ 51 బంతుల్లో 73(8 పోర్లు, 2 సిక్సులు), కొలిన్ మున్రో 47 బంతుల్లో 58(6 ఫోర్లు, ఒక సిక్స్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.