ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఐసీసీ, ఏసీసీల టోర్నమెంట్ నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీశాయి. 'క్రికెట్ ఇప్పుడు ప్రచారానికి పరోక్ష సాధనం' అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమం భారత్, పాకిస్తాన్ జట్లను పదే పదే ఒకే గ్రూప్లో ఉంచి మ్యాచ్లు జరిగేలా చూడటం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆయన డిమాండ్ను లేవనెత్తారు. ఐసీసీ టోర్నమెంట్ల డ్రా విధానంలో మరింత పారదర్శకత పెంచాలని.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లను తరచుగా నిర్వహించడాన్ని తగ్గించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ డిమాండ్ చేశారు.
2025 ఆసియా కప్లో జరిగిన రాజకీయ వివాదాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ రెండు జట్లను పదే పదే ఒకే గ్రూపులో ఉంచడం సమర్థనీయం కాదని అథర్టన్ బలంగా వాదించారు.

క్రికెట్ ఇప్పుడు ప్రచారానికి సాధనం
"ఒకప్పుడు దౌత్యానికి వాహనంగా ఉన్న క్రికెట్.. ఇప్పుడు విస్తృత ఉద్రిక్తతలకు, ప్రచారానికి పరోక్ష సాధనంగా మారింది. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఒక సీరియస్ స్పోర్ట్ టోర్నమెంట్ మ్యాచ్లను ఏర్పాటు చేయడం సరైనది కాదు." అని అథర్టన్ తన కాలమ్లో పేర్కొన్నారు.
ఆర్థిక ప్రయోజనాలే కీలకం
భారత్-పాకిస్తాన్ మ్యాచ్లకు ఉన్న భారీ ఆర్థిక శక్తి కారణంగానే ఐసీసీ ఈ రెండు జట్లను నిలకడగా ఒకే గ్రూప్లో ఉంచుతోందని అథర్టన్ అభిప్రాయపడ్డారు. ఐసీసీ టోర్నమెంట్లకు సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ హక్కుల విలువ పెరగడానికి ఈ మ్యాచ్లే ప్రధాన కారణం ప్రస్తుత హక్కుల సైకిల్ విలువ సుమారు 3 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్-పాక్ మ్యాచ్ల ద్వారా వచ్చే ఆదాయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ఆదాయాన్ని ఈ ప్రాంతంలోని గ్రాస్రూట్ క్రికెట్ అభివృద్ధికి ఉపయోగిస్తోంది.
ఇతర ప్రధాన క్రీడా టోర్నమెంట్ల మాదిరిగా కాకుండా, ఐసీసీ గ్రూప్ ఎంపిక ప్రక్రియ గురించి ఎటువంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ప్రతి టోర్నమెంట్లో కనీసం ఒక భారత్-పాక్ మ్యాచ్ను నిర్ధారించడానికి ఐసీసీ ఇలా చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఆసియా కప్ ఫార్మాట్ అయితే ఒక నెలలోనే మూడు మ్యాచ్లు జరిగేలా రూపొందించబడింది.అథర్టన్ మాట్లాడుతూ, "తదుపరి బ్రాడ్కాస్ట్ హక్కుల సైకిల్ కోసం, ఐసీసీ ఈవెంట్లకు ముందు డ్రా పారదర్శకంగా ఉండాలి. ఒకవేళ రెండు జట్లు ప్రతిసారీ కలుసుకోకపోయినా ఫర్వాలేదు" అని స్పష్టం చేశారు. ఇటీవల ఆసియా కప్లో జరిగిన వివాదాలు క్రికెట్, భూ రాజకీయాల మధ్య పెరుగుతున్న సంబంధాన్ని మరింత ప్రముఖంగా చాటాయి.