టీమిండియా క్రికెటర్లు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారత కుబేరుడు అనిల్ అంబానీ ఇంట్లో జరిగిని చవితి వేడుకలకు పలువురు స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. ఆసియా కప్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి, గాయం తిరగబెట్టడంతో మ్యాచులకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నాడు.
అతను కనుక పూర్తిగా కోలుకుంటే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీసులో ఆడతాడు. లేదంటే వరల్డ్ కప్లో కూడా అతని స్థానంలో వేరే వారిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, అంబానీ కుటుంబాలకు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సచిన్ కూడా తన భార్యా, పిల్లలతో కలిసి అంబానీల ఇంట్లో వేడుకల్లో పాల్గొన్నాడు.

సంప్రదాయ దుస్తులు ధరించిన టెండూల్కర్ ఫ్యామిలీ.. ఈ వేడుకలకు హాజరైన ఫొటోలను ఇన్స్టాగ్రాంలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. టెండూల్కర్ ఫ్యామిలీకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తున్నారు. అయ్యర్ కూడా తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అయ్యాయి.
వీరే కాదు, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా అంబానీల ఇంట్లో ఫంక్షన్కు హాజరయ్యాడు. తన భార్య అతియా శెట్టితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. భార్యతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్టాలో పంచుకున్నాడు. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆసియా కప్లో రాహుల్ చక్కగా రాణించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ సమయంలో తీవ్రంగా గాయపడిన కేఎల్ రాహుల్.. ఆసియా కప్లో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తను ఆడిన తొలి మ్యాచులోనే పాకిస్తాన్పై అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. వికెట్ కీపింగ్ కూడా చక్కగా చేశాడు. ఈ నేపథ్యంలోనే వరల్డ్ కప్లో కూడా అతను ఇలాగే రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.