
డ్రెస్సింగ్ రూమ్ను అద్దెకు తీసుకున్న బోర్డు
ఈ టెస్టు మ్యాచ్ కోసం న్యూలాండ్స్ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ను అక్కడి బోర్డు అద్దెకు తీసుకుంది. ఇప్పుడే కాదు.. 25 ఏళ్లుగా ఇక్కడ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆటగాళ్ల కోసం అక్కడి డ్రెస్సింగ్ రూమ్లను వాడుకున్నందుకు అద్దె కట్టడం ఆనవాయితీ వస్తోంది. వెస్టర్న్ ప్రావిన్స్ క్రికెట్ క్లబ్కు అద్దె ఇచ్చి మ్యాచ్ జరిగినన్ని రోజులూ వాటిని వాడుకుంటుంది.

1992 నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి
వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. 1992 నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి. అప్పట్లో క్లబ్ చైర్మన్ బ్రియాన్ బీబక్ క్రికెట్ బోర్డుతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు డబ్ల్యూపీసీసీ మేనేజర్ బ్రాడ్లీ, జనరల్ మేనేజర్ జాన్ వెల్లడించారు. క్రికెట్ నెక్ట్స్కు ఇచ్చిన ఇంటర్యూలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా క్లబ్ నడవాలంటే అద్దె వసూలు చేయాల్సిందేనని జాన్ అన్నారు.

స్పెషల్ గ్యాలరీల్లో కూర్చొని మ్యాచ్ చూస్తారు
అంతేకాదు క్లబ్లో ఉన్న 2400 మంది సభ్యులు కూడా టికెట్ కొని ఇక్కడి స్పెషల్ గ్యాలరీల్లో కూర్చొని మ్యాచ్ చూస్తారని వెల్లడించారు. 1864లో నిర్మించిన ఈ స్టేడియంలో అప్పటి చరిత్రను కొనసాగించేలా డ్రెస్సింగ్ రూమ్లో పెద్దగా మార్పులు చేయకపోవడం విశేషం. అంతర్జాతీయ మ్యాచ్ల సందర్భంగా అద్దె వసూలు చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో క్లబ్ను కొనసాగిస్తున్నట్లు బ్రాడ్లీ ఈ సందర్భంగా చెప్పారు.

ప్లేయర్స్ పేర్లతో ప్రత్యేకంగా ఓ బోర్డు
అంతేకాదు చారిత్రక లార్డ్స్లో ఉన్నట్లుగా ఈ గ్రౌండ్లో సెంచరీలు, ఐదు వికెట్లు తీసుకున్న ప్లేయర్స్ పేర్లతో ప్రత్యేకంగా ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అందులో అజహుద్దీర్, సచిన్ టెండూల్కర్ లాంటి భారతీయ క్రికెటర్లు పేర్లు కూడా ఉన్నాయి. అయితే క్లబ్ ఆధీనంలో ఉన్న పెవిలియన్లను వాడుకోవడం సరిగా లేదని, అందుకే కొత్తగా ప్లేయర్స్ పెవిలియన్ను నిర్మించబోతున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











