కేప్టౌన్: దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లపై విమర్శలు చేయొద్దు. దయచేసి నోరు అదుపులో ఉంచుకోండి అని దక్షిణాఫ్రికా బోర్డు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ ఫాల్ ఆ దేశ అభిమానులను కోరారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది.
హీరో విజయ్ దేవరకొండ సాయం.. గోల్డ్ మెడల్ కొట్టిన యువ బాక్సర్!!
కేప్టౌన్ వేదికగా 2018 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, బ్యాన్ క్రాఫ్ట్లు బాల్ టాంపరింగ్కు పాల్పడిన సంగతి తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్కు పాల్పడడంతో వార్నర్, స్మిత్లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరూ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్లో నిషేధం పూర్తి చేసుకున్న ఆసీస్ ఆటగాళ్లు క్రికెట్లో పునరాగమనం చేశారు.
గతేడాది ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్ 2019, ఆ తర్వాత యాషెస్ 2019 సిరీస్ సందర్భంగా మైదానంలో ఉన్న అభిమానులు వార్నర్, స్మిత్లు ఎద్దేవా చేశారు. కొందరైతే సాండ్ పేపర్ చూపిస్తూ తీవ్రంగా విమర్శలు చేసారు. ఇక బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత వార్నర్, స్మిత్ దక్షిణాఫ్రికాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ఆసీస్ ఆటగాళ్లను అవమానిస్తారని భావించిన క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) తమ అభిమానులకు ముందుగానే ఓ విజ్ఞప్తి చేసింది.
జాక్వెస్ ఫాల్ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికా అభిమానులకు ఇదే నా మనవి. మన ప్రత్యర్థులను ఎప్పుడూ గౌరవించాలి. అంతకుమించి ఇతర విషయాల జోలికి వెళ్లొద్దు. మైదానంలో మాత్రమే పోటీ ఉండాలి. బయట మనకు అలా ఉండకూడదు. క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన ఉండరాదు. ఆసీస్ క్రికెట్ జట్టుపై విమర్శలు చేయొద్దు. వార్నర్, స్మిత్లపై మాటల దాడి వద్దు. దయచేసి నోటిని అదుపులో ఉంచుకోండి. వారికి గౌరవం ఇవ్వండి. ఎటువంటి వివాదాలు, రాద్దాంతాలు మనకు వద్దు' అని విజ్ఞప్తి చేసారు. ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే స్టేడియం నుంచి బయటకు వెళ్ళగొడతాం అని హెచ్చరించారు.