హైదరాబాద్: శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు గురువారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ముమ్మరంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. రేపు జరిగే మ్యాచును చూసేందుకు 42 వేల మందిని అనుమతించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఎ) నిర్ణయించింది. దీని సామర్థ్యం 50 వేల అయినప్పటికీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో 42 వేల మందిని మాత్రమే అనుమతించాలని హెచ్ సిఎ నిర్ణయించింది. గత మ్యాచులో 20 వేల మందిని మాత్రమే అనుమతించారు. హైదరాబాద్ స్టేడియం భారత జట్టుకు కలిసొస్తుందనే అభిప్రాయం నెలకొని ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగును ఎంచుకోవడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. భారత క్రికెటర్లు గురువారం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రీబోక్ లో షాపింగు కూడా చేశారు. కొచ్చి వన్డేలో ఓడిపోయిన భారత్ కు హైదరాబాద్ మ్యాచ్ ప్రతిష్ఠాత్మకమైందే. రెండో వన్డేకు గాయం కారణంగా దూరమైన గంగూలీ ఈ వన్డేలో ఆడే అవకాశం ఉంది. రాబిన్ ఉతప్పకు గానీ, దినేష్ కార్తీక్ కు గానీ తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చునని తెలుస్తోంది. గురువారంనాడే హైదరాబాద్ కు చేరుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.