
హైదరాబాద్: క్రికెట్ అంటే తన రక్తంలోనే ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు.
జీవితంలో చాలా విలువైన దాని కోసం కొన్ని రోజులు మాత్రమే క్రికెట్కు దూరంగా ఉన్నానని తెలిపిన కోహ్లీ, తిరిగి క్రికెట్ ఆడటానికి సన్నద్ధమవడం ఏమాత్రం కష్టం కాదని అన్నాడు. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా మళ్లీ క్రికెట్కు ఎలా కనెక్ట్ అవుతారు అన్న ప్రశ్నకు 'క్రికెట్ నా రక్తంలోనే ఉంది. జీవితంలో ఎంతో ముఖ్యమైన పని కోసం సెలవు తీసుకున్నా.. మళ్లీ క్రికెట్తో కనెక్ట్ కావడం పెద్ద కష్టమేమీ కాదు' అని అన్నాడు.

పెళ్లి కోసం వెళ్లినా గత మూడు వారాలుగా దక్షిణాఫ్రికా పర్యటన కోసం ట్రైనింగ్ చేస్తూనే ఉన్నానని కోహ్లీ చెప్పాడు. ప్రస్తుతం ఉన్న టీమ్ గెలుపు కోసం ఆకలితో ఉన్నదని, ఈసారి అద్భుతం చేస్తామన్న కోహ్లీ చెప్పాడు. జట్టు ఆటగాళ్లు ఏఒక్కరి కోసమో, విదేశాలకు వెళ్లడం లేదని తేల్చి చెప్పాడు.
తాము దేశం తరపున ఆడటానికి మాత్రమే వెళ్తున్నామని, ఆటలో గెలవడానికి వందశాతం కృషి చేస్తామని కోహ్లీ అన్నాడు. సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కఠిన సవాళ్లు ఎదురవుతాయని కోహ్లీ చెప్పాడు.
'దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై ఆడేటప్పుడు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అక్కడికి ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్తాం. సుదీర్ఘంగా అక్కడే ఆడలేం. ఎందుకంటే షెడ్యూల్ను బట్టి మ్యాచ్లు ఉంటాయి. మా సత్తా చాటడానికి ఇది మంచి అవకాశమని చెప్పగలను' అని కోహ్లీ అన్నాడు.
'ప్రోటీస్ గడ్డపై కఠినమైన వాతావరణ పరిస్థితులు మనకు సవాళ్లు విసురుతాయి. కానీ ఏడాదిన్నరగా టీమిండియా అంటే ఏంటో నిరూపించాం. అక్కడి పరిస్థితుల గురించి జట్టు మొత్తానికి అవగాహన ఉంది. బ్యాట్స్మెన్ దృక్పథంపైనే ఇదంతా ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు బాగాలేవని భావిస్తే మన దృక్పథం సరైన దిశలో లేదని అర్థం. మానసికంగా సవాళ్లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రతిది మనకు స్వదేశంలోలాగానే అనిపిస్తుంది' అని చెప్పాడు.
'నేను కూడా దక్షిణాఫ్రికాలో ఒక్కసారే టెస్టు క్రికెట్ ఆడాను. నాతో పాటు రహానే, పుజారా కూడా ఈ సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సఫారీలో పూర్తి భిన్నంగా ఆడాల్సి ఉంటుంది. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి పర్యటన కూడా ఓ మంచి అవకాశం. టెస్టు సిరీస్ గెలువాలంటే సుదీర్ఘంగా నాణ్యమైన క్రికెట్ ఆడాలి' అని కోహ్లీ చెప్పాడు.
'ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూరిత వాతావారణం ఉంది. పరస్పరం గౌరవించుకుంటారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ చాలా మెరుగ్గా ఉంది. అయినప్పటికీ వాళ్లపై మెరుగ్గా ఆడిన చరిత్ర మనకు ఉంది. జొహాన్నెస్బర్గ్, డర్బన్లో గెలుపునకు దగ్గరగా వచ్చాం. మంచి టెస్టు క్రికెట్ ఆడాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఇక, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ దక్షిణాఫ్రికాతో సిరీస్ అంటే ఒక ఛాలెంజ్ లాంటిదని, పర్యటనలో జట్టు మెత్తం రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో కోహ్లీసేన మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 5న కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ పర్యటనకు కోహ్లీతో పాటు అనుష్క కూడా దక్షిణాఫ్రికా వెళ్లనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.