పెషావర్: పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో ఘోరం జరిగింది. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో చెలరేగిన గొడవ చివరకు ఏడుగురి ప్రాణాలు తీసింది. ఈ దారుణ సంఘటన పాక్ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులోని అబోటాబాద్ జిల్లాలో ఓ ఖాళీ స్థలంలో కొందరు పిల్లలు కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు.
వరల్డ్ టీ20: 'మిథాలీని బెంచ్కి పరిమితం చేయడం బాధించింది'
ఈ సమయంలో ఇరుజట్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఓ పిల్లాడిని "కావాలనే ఔట్ ఇచ్చారు" అంటూ ఒక జట్టు, లేదంటూ మరొక జట్టు గొవడకు దిగాయి. ఈ గొడవ చిలికిచిలికి పెద్దగా మారి పిల్లలు రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. దీంతో క్రికెట్ గొడవ కాస్తా తల్లిదండ్రుల దాకా వెళ్లింది.
ఈ గొడవ గురించి ఫిర్యాదు చేసేందుకు రెండు వర్గాలు ఓ పోలీసు పోస్టుకు చేరుకున్నాయి. పోలీసుల ఎదుట కూడా గొడవకు దిగిన ఇరు వర్గాలను రాజీ చేసేందుకు ప్రయత్నించిన పోలీసుల మాటలను పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్కు వచ్చే సమయంలోనే రెండు వర్గాల ప్రజలు ఆయుధాలతో రావడం విశేషం.
ఫిర్యాదు సమర్పిస్తున్న క్రమంలో ఆ గ్యాంగ్ల మధ్య మళ్లీ గొడవ రాజుకున్నది. దీంతో రెండు వర్గాలు కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన ముగ్గురు, మరో వర్గానికి చెందిన నలుగురు మృతిచెందారు. కాల్పుల్లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్నారు.