ఇటీవలే జింబాబ్వే లెజెండ్ హీత్ స్ట్రీక్ మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు అబద్ధమని స్వయంగా ప్రకటించిన స్ట్రీక్.. ఇలాంటి వదంతులు సృష్టించిన వాళ్లు తనకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు. అయితే ఈ వార్తలు వచ్చిన రోజుల వ్యవధిలోనే హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. ఈ విషయాన్ని అతని భార్య నడైన్ కూడా ధ్రువీకరించడం గమనార్హం.
జింబాబ్వే తరఫున 100 వికెట్లు తీసుకున్న తొలి క్రికెటర్ హీత్ స్ట్రీక్. ఫాస్ట్ బౌలర్ అయిన అతను జింబాబ్వే తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. 2000 నుంచి 2004 మధ్య ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో 4933 పరుగులు కూడా చేశాడీ పేసర్. వెస్టిండీస్తో హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక సెంచరీ కూడా చేశాడు. ఇప్పటికీ టెస్టు, వన్డే ఫార్మాట్లలో జింబాబ్తే తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఇతనే కావడం గమనార్హం.

తన అంతర్జాతీయ కెరీర్లో 445 వికెట్లు తీసుకొని ఆ దేశ లెజెండ్స్లో ఒకడిగా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలోనే స్ట్రీక్ క్యాన్సర్తో పోరాడుతున్నట్లు వార్దలు వచ్చాయి. సౌతాఫ్రికాలో అతనికి చికిత్స అందుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో క్యాన్సర్తో పోరాడుతూనే స్ట్రీక్ తుదిశ్వాస విడిచినట్లు సమచారం. ఈ వార్తలను ధ్రువకీరిస్తూ స్ట్రీక్ భార్య నడైన్ ఫేస్బుక్లో పోస్టు పెట్టింది.

'జీవితంలోనే అతిగొప్ప ప్రేమ, నా పిల్లల తండ్రి.. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి స్వర్గానికి వెళ్లిపోయాడు. చివరి రోజులను తను ప్రేమించే వారి మధ్యలో గడపాలని అనుకున్న తను.. ఇంట్లో ఉండగానే ఇది జరిగింది. అతనిపై అందరూ ప్రేమాప్యాయతలను చూపిస్తూనే వచ్చారు. ఎప్పుడూ ఒంటరితనం ఫీలవ్వనివ్వలేదు. మా ఆత్మలు శాశ్వతంగా కలిసిపోయాయి. స్ట్రీకీ.. నిన్ను మళ్లీ కలిసే వరకు ఎదురు చూస్తుంటా' అని నడైన్ పోస్టు పెట్టింది.