
హైదరాబాద్: చిన్నారుల జీవితాల్లో క్రికెట్ మార్పు తీసుకొస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. పాఠశాల విద్యార్థుల కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్లు పాల్గొన్నారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ "చిన్నారుల జీవితాల్లో క్రికెట్ మార్పు తీసుకొస్తుందని నమ్ముతున్నా. వారిని మెరుగైన మనుషులుగా తయారు చేస్తుందని భావిస్తున్నా. ఎందుకంటే జీవితంలో మాదిరిగానే క్రికెట్లోనూ అనేక దశలుంటాయి. ఒడుదొడుకులు అర్థమవుతాయి. మంచి, చెడూ తెలుస్తాయి" అని అన్నాడు.
"కష్టసమయంలో ఎలా బయటపడాలనే అవగాహన కూడా వస్తుంది. క్రికెట్ ఒక మంచి గురువు. చిన్నారులతో కాసేపు గడపడం ఆనందాన్నిస్తుంది. వారి ప్రయాణంలో ఎంతోకొంత మేలు చేసేందుకు అవకాశం లభించింది. వారెంతో నిజాయతీ, అంకితభావంతో ఉంటారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడినప్పుడు కలిగిన సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేం" అని కోహ్లీ అన్నాడు.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. కాగా, టోర్నీలో భాగంగా టీమిండియా జూన్ 22(శనివారం) ఆప్ఘనిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కి సౌతాంప్టన్లోని రైస్ బౌల్ స్టేడియం వేదిక కానుంది.