
వెల్లింగ్టన్: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నూతన కెప్టెన్గా బాధ్యతలందుకొని ఫైనల్ వరకూ తీసుకెళ్లిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కెప్టెన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ దొరికేశాడు. కోచ్గా గ్యారీ స్టీడ్ నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. కివీస్ను చక్కని జట్టుగా తీర్చిదిద్దడంలో తనదైన ముద్రవేసిన కోచ్ మైక్ హెస్సన్ స్థానాన్ని సరైన వ్యక్తితోనే భర్తీ చేసినట్లు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
46ఏళ్ల స్టీడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కెరీర్ను ఆరంభించారు. 1999కి ముందు కేవలం అయిదు టెస్టు మ్యాచ్లను మాత్రమే స్టీడ్ ఆడారు. 2014, 2015, 2017ల్లో క్యాంటర్బరీ జట్టు దేశీయంగా టైటిల్స్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కివీస్ జట్టు రాటుదేలడానికి హెస్సన్ చేసిన కృషిని, కొనసాగిస్తూ మరింత నాణ్యమైన జట్టుగా న్యూజిలాండ్ను తయారు చేయడానికి కృషి చేస్తానని గ్యారీ తెలిపారు.
కోచ్గా కొనసాగేందుకు మరో ఏడాది సమయం ఉన్నా, కోచ్ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు హెస్సన్ ఈ ఏడాది జూన్లో వెల్లడించాడు. కుటుంబంతో గడిపేందుకు సరైన సమయం దొరకకపోవడం వల్లే తాను కోచ్ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నానని తెలిపాడు. హెస్సన్ కోచ్గా ఉన్న ఆరేళ్ల కాలంలో న్యూజిలాండ్ ఎన్నో విజయాలు సాధించింది. 2015 ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లింది.
'బ్లాక్ క్యాప్స్ ఇప్పటికే బలమైన, అద్భుత ప్రదర్శన ఇవ్వగల జట్టుగా ఉంది. సిరీస్లు, టైటిల్స్ను సొంతం చేసుకోవాలని కనె విలియమ్సన్ నేతృత్వంలో కివీస్ జట్టు దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతోంది. అలాంటి జట్టుకు కోచ్గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. త్వరగా జట్టును కలవాలని ఉవ్విళ్లూరుతున్నా' అని గ్యారీ పేర్కొన్నాడు.