
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆయన వయసు 66 ఏళ్లు. ఆయనకు ఒక భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు. గత రెండు వారాలుగా ఎయిమ్స్ డాక్టర్లు ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో శనివారం మధ్యాహ్నాం 12.07 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు ఎయిమ్స్ డాక్టర్లు ప్రకటించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆగస్టు 9వ తేదీన జైట్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థి సంఘానికి ఆయన నాయకుడిగా ఎన్నికయ్యారు.
ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్షను కూడా అనుభవించారు. 1977లో జైట్లీ ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1980లో ఆయన బీజేపీలోకి అడుగుపెట్టారు. తర్వాత అదే ఏడాది ఆయన బీజేపీ ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు.
2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి అమృత్ సర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. మోడీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు.
2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అరుణ్ జైట్లీ కన్నుమూసిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... ప్రస్తుత క్రికెటర్ శిఖర్ ధావన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.
ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. కొన్నేళ్లుగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది యువ క్రికెటర్లను ప్రొత్సహించారు. ఇక, ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో కీలకంగా వ్యవహారించారు.
సెహ్వాగ్ తన ట్విట్టర్లో "అరుణ్ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్ చేశారు.
టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ట్విట్టర్లో తండ్రి నీకు మాట్లాడాలని చెప్తారు. తండ్రిలాంటి వారు నిన్ను ప్రసంగించాలని సూచిస్తారు. నాన్న నీకు నడక నేర్పిస్తారు. నాన్నలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. తండ్రి నీకు పేరు పెడతాడు. తండ్రి సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా పితృ సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది" అని ట్వీట్ చేశాడు.