IND vs PAK: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మరోసారి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లను చూడబోతున్నారు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్థాన్ జట్టు తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయి నిష్క్రమించింది. కానీ రెండు దేశాల జట్లు మళ్లీ ఢీకొనబోతున్నాయి.
ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) నిర్ణయించింది. ఈ టోర్నమెంట్ ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉంది. ఈ సారి ఆసియా కప్ యూఏఈ లేదా శ్రీలంకలో జరగవచ్చు. ఈ టోర్నమెంట్ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ లో భాగంగా భారత్ ,పాకిస్థాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది.

టీ-20 ఫార్మాట్ లోని ఆసియా కప్
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న తరుణంలో ఆసియా కప్ గురించి కీలక వార్తలు వచ్చాయి. 2026లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఆసియా కప్ కూడా అదే ఫార్మాట్ లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 జట్లు ఆసియా కప్ లో పాల్గొననున్నాయి. ఆసియా కప్ లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్, యూఏఈ, హాంకాంగ్ జట్లు పాల్గొననున్నాయి. అన్ని జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు.
ఊహించినట్లుగానే భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూపులోనే ఉంటాయి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. రెండు జట్లు తదుపరి రౌండ్ కు అర్హత సాధిస్తే సూపర్-4 దశలో కూడా మళ్లీ ఆడొచ్చు. మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. సూపర్ -4లో భారత్, పాక్ మొదటి రెండో స్థానాల్లో నిలిస్తే ఫైనల్ లో మూడోసారి తలపడవచ్చు. ఏదైతేనేం భారత్, పాక్ మ్యాచ్ జరిగితే అదో మినీ యుద్ధంలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఆసియా కప్ ను సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి.
అట్టడుగున ఆతిథ్య జట్టు
ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి 5 రోజుల్లోనే పాకిస్థాన్ నిష్క్రమించింది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 60 పరుగుల తేడా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్ తో పాకిస్థాన్ తన రెండో మ్యాచ్ ఆడింది. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ విధంగా సొంత ఆతిథ్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో పాకిస్థాన్ జట్టు మొదటి ఐదు రోజుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయి నిష్క్రమించింది. గ్రూప్ దశలో పాకిస్థాన్ గురువారం బంగ్లాదేశ్ తో తన చివరి మ్యాచ్ ఆడవలసి వచ్చింది. కానీ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ విధంగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు గ్రూప్-ఏలో అట్టడుగున నిలిచింది.
ASIA CUP 2025 UPDATES: [Cricbuzz]
— Johns. (@CricCrazyJohns) February 27, 2025
- T20I format.
- 8 teams (IND, PAK, SL, BAN, AFG, Oman, UAE, HK)
- 19 games.
- India vs Pakistan could potentially play 3 times.
- UAE or SL as venues.
- September 2nd week to 4th week pic.twitter.com/bb4BiOFhmX