
హైదరాబాద్: బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో పసికూన ఆప్ఘనిస్థాన్ విజయం సాధించడంతో ఆ దేశ్ క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చొట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ 224 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఆప్ఘన్ విజయం సాధించడానికి చివరి రోజైన సోమవారం 4 వికెట్లు అవసరం కాగా వరుణుడు అంతరాయ కలిగించాడు. దీంతో చివరిరోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 398 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 173 పరుగులకే కుప్పకూలింది.
దీంతో ఆప్ఘనిస్థాన్ 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్టు క్రికెట్లో ఆప్ఘనిస్థాన్కు ఇది రెండో విజయం కావడం విశేషం. గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్లో ఓటమిపాలైన ఆప్ఘనిస్థాన్ ఆ తర్వాత ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆప్ఘనిస్థాన్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. టెస్ట్ హోదా పొందిన తర్వాత ఆడిన మూడు మ్యాచ్లలో రెండింటిలో విజయం సాధించి తక్కువ మ్యాచ్లలో రెండు టెస్ట్ విజయాలు నమోదు చేసిన ఆస్ట్రేలియా దీర్ఘకాలిక రికార్డును సమం చేసింది.
బంగ్లాపై విజయం సాధించిన ఆనందరంలో ఆప్ఘన్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోగా... ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా వీక్షించిన ఆప్ఘనిస్థాన్ చిన్నారులు సైతం తమ జట్టు గెలిచిందన్న ఆనందంలో సరదాగా గంతులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.