
హైదరాబాద్: శ్రీలంక క్రికెట్లో అవినీతి తారాస్థాయికి చేరుకుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వ్యాఖ్యానించారు. మ్యాచ్ ఫిక్సింగ్లు జరగకుండా చూడటంలో పూర్తిగా విఫలమవుతోన్న ఐసీసీ క్రికెట్ పరువును దిగజారుస్తోందని వెల్లడించాడు.
తాజాగా, పిచ్ ఫిక్సింగ్పై దోహాకు చెందిన 'ఆల్ జజీరా' అనే న్యూస్ ఛానల్ 'క్రికెట్స్ మ్యాచ్ ఫిక్సర్స్' పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ఫిక్సింగ్లో శ్రీలంక ఆటగాడు, గ్రౌండ్స్మ్యాన్ పాత్ర ఉందని స్పష్టం చేస్తూ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.
గాలేలో 2017, జులై 26 నుంచి 29 వరకు జరిగిన భారత్-శ్రీలంక టెస్టు మ్యాచ్, రాంచీలో 2017, మార్చి 16-20 మధ్య జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు, చెన్నైలో 2016, డిసెంబర్ 16-20 మధ్య జరిగిన భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ ఫిక్సింగ్కు గురయ్యాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అర్జన రణతుంగ.. అల్ జజీరా డాక్యుమెంటరీపై బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'ఇక్కడ అవినీతి తారా స్థాయికి చేరిపోయింది. ఇప్పుడు చిన్న చేపను పట్టుకుని వాళ్లు ఏం చేస్తారు. పెద్ద చేప ఏనాడో దేశం దాటి వెళ్లిపోయింది. ఐసీసీ అవినీతి నిరోధక శాఖపై నేను పూర్తి నిరుత్సాహంతో ఉన్నా. శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడలేనప్పుడు ఈ అవినీతి నిరోధక శాఖను కొనసాగించాల్సిన అవసరంలేదు' అని అన్నాడు.
'ఆల్ జజీరా' అనే న్యూస్ ఛానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో తాము ఫిక్సింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్న గ్రౌండ్స్మ్యాన్ తరంగ ఇండికా, డిస్ట్రిక్ట్ కోచ్ తరిందు మెండిస్పై వేటు వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీనిపై రణతుంగ మాట్లాడుతూ 'వారు చిన్న చేపలు మాత్రమే. పై స్థాయి వాళ్లతో ఎలాంటి ఒప్పందాలు లేకుండా వీళ్లు ఆ పని చేయలేరు. ఒక పెద్ద తలకాయకి ఈ ఫిక్సింగ్తో సంబంధం ఉంది. అతని సాయంతో వీళ్లు పిచ్ స్వభావాన్ని మార్చారు. నేరుగా ఫిక్సింగ్లో పాల్గొన్న వీళ్లను మాత్రమే కాదు, అతన్ని కూడా సస్పెండ్ చేయాలి' అని పేర్కొన్నాడు.
ఐసీసీ అవినీతి నిరోధక శాఖ చాలా బలహీనంగా ఉందని, వాళ్లు తమ అధికారాలను వాడుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా రణతుంగ ఆరోపించారు. ప్రపంచ వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలగా క్రికెట్ స్థాయి దిగజారిపోవడానికి కూడా ఇది ఒక కారణమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఐసీసీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి మారదని రణతుంగ అభిప్రాయపడ్డాడు.
కాగా, ముంబైలో జరిగిన 2011 వరల్డ్కప్ ఫైనల్లో కూడా ఫిక్సింగ్ జరిగిందని గతేడాది రణతుంగ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా రణతుంగ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఐసీసీ కానీ, శ్రీలంక క్రికెట్ కానీ విచారణ జరిపించకపోవడం బాధాకరమని అన్నాడు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతాయని చెప్పారు.