సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ నెలలో జరగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్లో రిజర్వ్డే ఉంచాలని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) నిర్వహించే సమావేశంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదించనుంది. ఇటీవల ఆసీస్లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో సెమీఫైనల్స్కు రిజర్వ్డే ఉంచకపోవడంతో ఐసీసీ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. ఈ మెగా టోర్నీ నిర్వహించిన సీఏ కూడా నాకౌట్ మ్యాచ్లకు రిజర్వ్డే ప్రస్తావన తేకపోవడంతో ఐసీసీ తేలిగ్గా తీసుకుంది.
మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్-భారత్ల మధ్య జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయ్యింది. దానికి రిజర్వ్డే లేని కారణంగా.. గ్రూప్ దశలో అగ్రస్థానంలో ఉన్న హర్మన్సేన ఫైనల్కు వెళ్లిన సంగతి తెలిసిందే. రిజర్వ్డే లేకపోవడం ఇంగ్లండ్కు శాపంలా మారింది. మ్యాచ్ ఆడకుండానే టోర్నీని సెమీస్తోనే ముగించడంపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే పురుషుల ప్రపంచకప్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని.. ఐసీసీ నిర్వహించే సమావేశంలో సెమీస్కు రిజర్వ్డే గురించి సీఏ చర్చించే అవకాశం ఉందని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. రిజర్వ్డే ప్రతిపాదనను సీఏ సిద్ధం చేసిందట. ఐసీసీ నిర్వహించబోయే సమావేశంలో నాకౌట్ మ్యాచ్లకు రిజర్వ్ డే ప్రస్తావన తీసుకురానుంది. మహిళల ప్రపంచకప్కు రిజర్వ్డే ప్రతిపాదనను మరిచిన సీఏ.. ఈసారి మాత్రం ఆ తప్పిదం చేయకూడదనే భావనలో ఉంది.
పురుషుల టీ20 ప్రపంచకప్లో రిజర్వ్డే ఉంటుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈవో కెవిన్ రాబర్డ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. 'మహిళల టోర్నీలో ఏర్పడిన పరిస్థితులు భవిష్యతుల్లో నిర్వహించే టోర్నీలపై ప్రభావం చూపుతుంది. పురుషుల టీ20 ప్రపంచకప్ సెమీస్లో కూడా రిజర్వ్డే ఉంచాలని ఎంతో మంది భావిస్తున్నారు. అయితే మహిళల ప్రపంచకప్ సెమీస్లో రిజర్వ్డే లేనందుకు ఇంగ్లండ్ మహిళల జట్టుకు ఎంతో బాధ ఉంటుంది. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నున్నా' అని తెలిపారు.