
హైదరాబాద్: 2019 సంవత్సరానికి గుడ్బై చెబుతూ.... 2020కి స్వాగతం పలకాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) క్రికెట్ గణాంకాలను లోతుగా పరిశీలించి ఈ దశాబ్దపు అత్యుత్తమ టెస్టు జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టులో భారతదేశం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించింది.
ఓపెనర్లుగా అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్లను ఎంపిక చేసింది. వీరిద్దరూ భిన్నమైన ఆట శైలి కలిగిన వారు మాత్రమే కాదు, తాము ప్రాతినిథ్యం వహించిన జట్లకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించారు. గతేడాది టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన తర్వాత అలెస్టర్ కుక్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
అంతేకాదు ఆస్ట్రేలియాపై 48.94, ఇండియాపై 51.45 యావరేజిని అలెస్టర్ కుక్ కలిగి ఉన్నాడు. ఇక, డేవిడ్ వార్నర్ విషయానికి ఇటీవలే సొంతగడ్డపై శ్రీలంక, పాకిస్థాన్లతో జరిగిన టెస్టు సిరిస్ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో బ్రియాన్ లారా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుకి చేరువగా వచ్చాడు.
ఇక, మిడిలార్డర్లో కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ల మధ్య గట్టి పోటీ నిలిచింది. అయితే, చివరకు విరాట్ కోహ్లీనే టెస్టుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
న్యూజిలాండ్ కెప్టెన్గా కేన్ విలియమ్సన్ జట్టుని సమర్ధవంతంగా నడిపిస్తున్నాడు. టెస్టుల్లో 50కిపైగా యావరేజిని నమోదు చేయడంతో పాటు 6000 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు కూడా ఉన్నాయి. వికెట్ కీపర్గా క్రికెట్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ను ఎంపిక చేసి ఆశ్చర్యపరిచింది.
ఆల్ రౌండర్గా ఇంగ్లాండ్కు చెందిన బెన్ స్టోక్స్ను ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా బౌలర్లుగా డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయాన్, జేమ్స్ ఆండర్సన్లకు చోటు కల్పించింది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు కెప్టెన్గా విరాట్ కోహ్లీని ఎంచుకోవడం విశేషం.
క్రికెట్ ఆస్ట్రేలియా ఈ దశాబ్దపు టెస్టు జట్టు
అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ (కెప్టన్), ఎబి డివిలియర్స్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లియోన్, జేమ్స్ ఆండర్సన్