
హైదరాబాద్: 2018 చివర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. పర్యటనలో భాగంగా టీ20లతో మొదలుపెట్టి టెస్ట్, వన్డే సిరీస్లు ఆడనుంది. అడిలైడ్ టెస్టును డే అండ్ నైట్ విధానంలో ఆడించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఈ విషయంలో బీసీసీఐపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కానీ మన బోర్డు మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. దీంతో ఆతిథ్య జట్టుకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాడి మొదలుపెట్టింది.
కానీ, ఈ విషయంలో సదర్లాండ్ నిజం చెప్పడం లేదని బీసీసీఐ విమర్శలు గుప్పిస్తోంది. సదర్లాండ్ ఈ విషయమై ఈ ఏడాది జనవరిలో లేఖ రాశారు. దీనికి బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి అదే రోజు బదులిచ్చారు. భారత జట్టు డే అండ్ నైట్ టెస్టులు ఆడదని తేల్చి చెప్పారు. గత నెలలో ఐసీసీ బోర్డ్ మీటింగ్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు కోల్కతా వచ్చినప్పుడు కూడా బీసీసీఐ సీఈవో మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
కానీ ఈ విషయలేవీ చెప్పకుండా.. టెస్ట్ సిరీస్ గెలవాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ డే అండ్ నైట్కు ఒప్పుకోవడం లేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పరోక్ష ధోరణిలో రెచ్చగొడుతోంది. సదర్లాండ్ తీరుతో ఆగ్రహంగా ఉన్న బీసీసీఐ అసలు డే అండ్ నైట్ టెస్ట్ ఆడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తోంది. జనాలను ఆకర్షించి సొమ్ము చేసుకోవడం కోసమే కదా మీ తాపత్రయం అంటూ ఘాటుగా విమర్శిస్తోంది.
బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా క్రికెట్ సుస్పష్టమైన నివేదికను ఇవ్వలేకపోతున్నందున ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య పొరపచ్చాలు ఏర్పడేలా ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం మాటల వరకే పరిమితమైన ప్రణాళికలను అధికారిక ఈ మెయిల్ల ద్వారా ధ్రువీకరించాలని పిలుపునిచ్చారు. ఇండియా క్రికెట్ బోర్డు నిర్ణయానికి కట్టుబడి పని చేస్తుందని, కేవలం ఆశ చూపించి డబ్బులు కాజేసే బుద్ది కాదని ఆమె తెలిపారు.