
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లపై అక్కడి అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. క్రికెట్లో జాత్యాహంకార వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ).. టీమిండియా ఫిర్యాదు మేరకు వెంటనే విచారణ ప్రారంభించింది.
మూడో రోజు ఘటన సద్దుమణగక ముందే నాలుగో రోజు ఆటలో మరోసారి మొహ్మద్ సిరాజ్పై అలాగే నోరు పారేసుకున్నారు మరికొందరు ఆసీస్ అభిమానులు. సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వెనుకాల స్టాండ్స్లో కూర్చున్న కొంత మంది అభిమానులు ఏదో అన్నారు. దీంతో అతడు నేరుగా కెప్టెన్ అజింక్య రహానే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అంపైర్ పాల్ రైఫిల్కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ఫ్యాన్స్ను బయటకు పంపించేశారు. దీని కారణంగా టీ సమయానికి ముందు ఆట 10 నిమిషాల పాటు నిలిచిపోయింది.
మరొకవైపు ఇదొక జంటిల్ మ్యాన్ గేమ్ అని, ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలకు చోటు లేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనిపై సీఏ సీరియస్గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఇక రేసిజం ఘటనను క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. సంబంధిత అభిమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఆసీస్ క్రికెట్ బోర్డు.. టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి.. దానిని ట్విటర్లో పోస్ట్ చేసింది.
'ఇలాంటి వివక్షాపూరిత ప్రవర్తనను క్రికెట్ ఆస్ట్రేలియా ఖండిస్తోంది. దీనిపై ఐసీసీ విచారణ ఫలితం కోసం ఎదురు చూస్తోంది. బాధ్యులను గుర్తించిన తర్వాత వేధింపుల నిరోధక కోడ్ ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలం నిషేధం, మరిన్ని ఆంక్షలు, న్యూసౌత్వేల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటివి చేస్తాం. సిరీస్కు ఆతిథ్యమిస్తున్న వ్యక్తులుగా మేము మా ఇండియన్ క్రికెట్ స్నేహితులకు క్షమాపణ కోరుతున్నాం' అని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.