
సిడ్నీ: కఠిన క్వారంటైన్ నిబంధల కారంగా చివరిదైన నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా నిరాకరించిందని అక్కడి మీడియాలో వచ్చిన వార్తలను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో నిక్ హాక్లీ కొట్టిపారేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి అభ్యంతరాలకు సంబంధించి అధికారికంగా తమకేమీ అందలేదన్నారు. క్వీన్స్ల్యాండ్లో క్వారంటైన్ నిబంధనల గురించి భారత క్రికెట్ బోర్డుకు పూర్తిగా అవగాహన ఉందన్నారు. వాటిని పాటించేందుకు పూర్తిగా మద్దతు ప్రకటించిందని నిక్ తెలిపారు.
సోమవారం క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'ప్రతిరోజూ మేం బీసీసీఐ అధికారులతో మాట్లాడుతున్నాం. వారు మాకెంతో సహాయకారి, మద్దతుగా ఉన్నారు. అభ్యంతరాలకు సంబంధించి అధికారికంగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మేం నిర్దేశించిన షెడ్యూలు ప్రకారం ఆడాలని రెండు జట్లు కోరుకుంటున్నాయి' అని అన్నారు. యథావిధిగా బ్రిస్బేన్ టెస్టు జరుగుతుందని నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇతర విషయాలలో టీమిండియా క్రికెటర్లు వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సహా ఐదుగురు క్రికెటర్లు హోటల్కు వెళ్లి భోజనం చేయడం.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఓ దుకాణానికి వెళ్లిన బొమ్మలు కొనుగోలు చేయడం లాంటివి కలకలం రేపాయి. వారు మాస్కులు పెట్టుకోలేదని, కొవిడ్ నియమావళిని ఉల్లంఘించారని ఆస్ట్రేలియాలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించాక మాస్కులు పెట్టుకోవడంలో తర్కం ఏముందని టీమిండియా వాదిస్తోంది.
కరోనా వైరస్ కొత్త కేసులు పెరగడంతో సిడ్నీ టెస్టుకు 25 శాతం మందినే అనుమతిస్తున్నారు. 38 వేల సామర్థ్యం గల సిడ్నీ మైదానంలోకి సుమారుగా 9500 మందికి మాత్రమే అనుమతి ఉంది. 'భౌతికదూరం వంటి నిబంధనలు పాటించాలంటే తక్కువ మందినే అనుమతించక తప్పదు. ఇప్పటికే టికెట్లు తీసుకున్న వారికి సోమవారం నుంచి నగదు వాపస్ చేస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా తిరిగి విక్రయాలు చేపడతాం' అని నిక్ హాక్లీ తెలిపారు. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమం కావడంతో గురువారం నుంచి ప్రారంభమయ్యే సిడ్నీ టెస్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.