India's tour of Australia: భారత జట్టు మొన్నటివరకు శ్రీలంక పర్యటనలో బిజీగా గడిపింది. మూడు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్ను సొంతం చేసుకుంది. ఆడిన మూడింట్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. లంకేయులను 3-0 తేడాతో మట్టికరిపించింది. సూపర్ ఓవర్ దాకా వెళ్లిన చివరి మ్యాచ్ మినహా మిగిలిన రెండింట్లోనూ వార్ వన్సైడ్ అయింది.
ఈ జైత్రయాత్రకు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్లో బ్రేక్ వేశారు లంకేయులు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ భారత్కు షాకుల మీద షాకులు ఇచ్చారు. తొలి వన్డేను టై చేశారు. రెండు, మూడు మ్యాచ్లల్లో దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. భారత్ను మట్టికరిపించారు. మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకున్నారు.

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది రోహిత్ సేన. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అయిదు టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. ఈ సిరీస్ తేదీలు, అవి ప్రారంభం అయ్యే టైమ్, వేదికలను ఖరారు చేసింది.
తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22వ తేదీన జరుగుతుంది. దీనికి పెర్త్ ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2:20 నిమిషాలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో టెస్ట్- డిసెంబర్ 6వ తేదీన అడిలైడ్, మూడో మ్యాచ్- 14వ తేదీన బ్రిస్బేన్, 4వ మ్యాచ్- 26వ తేదీన మెల్బోర్న్లో షెడ్యూల్ అయ్యాయి. చివరి టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ఉంటుంది. దీనికి సిడ్నీ వేదిక.
ఈ సిరీస్లో భాగంగా భారత జట్టు.. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11తో డే/నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఇది పింక్ బాల్ మ్యాచ్. క్యాన్ బెర్రా స్టేడియం ఈ అరుదైన మ్యాచ్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. తొలి రెండు టెస్ట్ మ్యాచ్ల మధ్య ఉండే గ్యాప్లో అంటే నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో ఈ మ్యాచ్లు ఉంటాయి.
ఈ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ క్రికెట్ ఆస్ట్రేలియాకు కాసులపంట పండించబోతోంది. ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా భావించే యాషెస్ సిరీస్తో సమానంగా డబ్బులొస్తాయని అంచనా వేస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని యాషెస్ సిరీస్తో పోల్చడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిక్ హాక్లే తేల్చి చెప్పారు.
ఈ రెండు సిరీస్లు.. ఆస్ట్రేలియన్ క్రికెట్ క్యాలెండర్లో అత్యంత కీలకమైనవని, కమర్షియల్గా ఎంతో ప్రాధాన్యత ఉన్నాయని పేర్కొన్నారు. క్రికెట్ ప్రేమికులు, స్పాన్సర్ల నుంచి వీటికి అనూహ్య ఆదరణ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. టికెట్ల విక్రయాలు గత సీజన్ల కంటే ఆరు రెట్లు అధికంగా ఉండొచ్చని అంచనా వేస్తోన్నట్లు వెల్లడించారు.