
హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో ఒక్కసారిగా గురువారం వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 491 పరుగులు చేసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాపై 164 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. డబుల్ సెంచరీ చేసిన అలెస్టర్ కుక్పై మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు అభినందిస్తుంటే, ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజాని మాత్రం విమర్శిస్తున్నారు. మూడో రోజు ఉస్మాన్ ఖవాజా పట్టిన క్యాచ్ ఈ విమర్శలకు కారణమైంది.
మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజైన గురువారం ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (56: 63 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు) ఇచ్చిన క్యాచ్ని బౌండరీ లైన్కి సమీపంలో ఖవాజా అందుకున్నాడు. అయితే.. క్యాచ్ని అందుకునే క్రమంలో బంతి నేలకి తాకినట్లు రిప్లైలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఇందుకు సంబంధించి సరైన వీడియో ఫుటేజీ దొరక్కపోవడంతో థర్డ్ అంపైర్ ఆ క్యాచ్ని ఔట్గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంఫైర్ నిర్ణయంతో ఇంగ్లాండ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఐదు టెస్టుల ఈ యాషెస్ సిరీస్ను 0-3తో కోల్పోయిన ఇంగ్లాండ్ బాక్సింగ్ డే టెస్టు అయిన నాలుగో టెస్టులో ఆధిక్యం దిశగా సాగుతోంది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెస్టర్ కుక్ (244 నాటౌట్) డబుల్ సెంచరీ సాధించడంతో
మూడో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 491/9తో నిలిచింది.
తాజా డబుల్ సెంచరీతో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అలెస్టర్ కుక్ (11868) వెస్టిండిస్కు చెందిన చందర్ పాల్ (11867)ను అధిగమించి ఏడో స్ధానంలో నిలిచాడు. అంతేకాదు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో త్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు ఆటగాడిగా అలెస్టర్ కుక్ నిలిచాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.