పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అర్థ సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడానికి సహచర ఆటగాడు ఎంఎస్ ధోనినే కారణమని పేసర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. తాను క్రీజ్లోకి వచ్చిన క్షణంలో తనకు ధోని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడని అన్నాడు.
ముందు ఒత్తిడికి లోనుకాకుండా టెస్ట్ తరహా ఆటను ఆడమని ధోనీ తనకు సలహా ఇచ్చినట్లు అతను చెప్పాడు. ఇంకా చాలా ఓవర్లు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడని, దీంతో తనపై ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేశానని వివరించాడు.

ధోని చెప్పినట్లే క్రీజ్లో నిలబడటానికి తొలి ప్రాధాన్యతనిచ్చి ఒక్కో పరుగుతో ముందుకు సాగానని, ఆయన సలహాతోనే విలువైన భాగస్వామ్యం నమోదైందని భువీ మీడియాకు వివరించాడు. ధోనీ సలహాలే టీమిండియా విజయానికి దోహదం చేశాయని భువనేశ్వర్ అన్నాడు.
రెండో వన్డేలో ఓటమి అంచుల వరకూ వెళ్లిన భారత్ను గెలిపించడంలో భువీ పోరాట పటిమపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్ అద్భుత బ్యాటింగ్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యాన్ని కలిగించింది. 131 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో 27ఏళ్ల భువనేశ్వర్ 53 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే.
ఓపెనర్లు శుభారంభం చేయడంతో భారత్ అలవోకగా విజయం సాధిస్తుందని అనుకున్నానని, అనూహ్యంగా వరుస వికెట్లు కోల్పోవడంతో ఓటమి కోరల్లో చిక్కుకుందని భువీ చెప్పాడు. ఈ తరుణంలో బ్యాటింగ్కు దిగిన తాను భారత్ను గెలిపిస్తానని వూహించలేదని అన్నాడు. మిస్టర్ కూల్ ధోనీ తన దగ్గరకు వచ్చి సుధీర్ఘ ఫార్మాట్ వలె ఒత్తిడి లేకుండా ఆడుకోమని చెప్పటంతో తాను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగానని చెప్పాడు. కెరీర్లో భువనేశ్వర్కిది తొలి అర్థశతకం కావడం విశేషం. సిరీస్లో భాగంగా మూడో వన్డే ఆగస్టు 27న కాండీలో జరగనుంది.