
ట్రినిడాడ్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ధనాధన్ వినోదంను కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 అందిస్తోంది. కరోనా కారణంగా నాలుగు నెలలుగా క్రికెట్ నిలిచిపోవడంతో నిరాశలో ఉన్న అభిమానులను విండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ అలరిస్తున్నాడు. సీపీఎల్ 2002లో ట్రిన్బాగో నైట్రైడర్స్ తరఫున ఆడుతున్న నరైన్.. ఆడిన రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. గయానా అమెజాన్ వారియర్స్తో మంగళవారం జరిగిన లీగ్ తొలి మ్యాచులో అర్ధ శతకం చేసిన నరైన్.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారు జామున జమైకా తల్లావాస్తో ముగిసిన మ్యాచులోనూ మరో హాఫ్ సెంచరీ బాదాడు. నరైన్ రెచ్చిపోవడంతో సీపీఎల్ లీగ్లో ట్రిన్బాగో రెండో విజయం అందుకుంది.
టాస్ గెలిగిచిన నైట్ రైడర్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో మొదటగా బ్యాటింగ్కు దిగిన జమైకా తల్లావాస్కు ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు ఖాతా తెరవకముందే ఓపెనర్ వాల్టన్ డకౌట్ అయ్యాడు. ఇక 10 పరుగుల వద్ద నికోలస్ కిర్టన్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. కొద్ది సమయానికే కెప్టెన్ రోవ్మన్ పావెల్ (8) కూడా నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేశాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి అసిఫ్ అలీ అండగా నిలిచాడు.
42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం ఫిలిప్స్ పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో రమాల్ లూయిస్ (15), ఆండ్రీ రసెల్ (25)లు జట్టును ఆదుకున్నారు. వీరి భాగస్వామ్యంతో జమైకా తల్లావాస్ కొంత కోలుకుంది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ట్రిన్బాగో బౌలర్లలో జేడెన్ సీల్స్, అలీ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రిన్బాగో నైట్రైడర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ లెండిల్ సిమన్స్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ సునీల్ నరైన్ వీరవిహారం చేశాడు. జమైకా తల్లావాస్ బౌలర్లను ఆటాడుకుంటూ బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే నరైన్ (53; 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ బాదాడు. అతనికి కోలిన్ మున్రో అండగా నిలిచాడు. నరైన్ ఔట్ అయిన అనంతరం మున్రో (49; 46 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) అద్భుతంగా పోరాడి జట్టుకి విజయాన్ని అందించాడు. డారెన్ బ్రేవో (14) నిరాశపరిచాడు. తల్లావాస్ బౌలర్లలలో ఫిడేల్ ఎడ్వర్డ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సందీప్ లామిచనే తలో వికెట్ తీశారు. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' సునీల్ నరైన్కు దక్కింది.