
తరోబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సీజన్ మ్యాచ్లకు వరణుడు పదేపదే ఆటంకం కలిగిస్తున్నాడు. గురువారం తరోబా వేదికగా బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా పలుమార్లు నిలిచిపోయింది. అయితే డక్వర్త్ లూయిస్ పద్దతిలో బార్బడోస్పై సెయింట్ లూసియా విజయం సాధించింది. సెయింట్ లూసియా విజయలక్ష్యం 5 ఓవర్లలో 47 పరుగులుగా నిర్ధారించగా.. మరో ఐదు బంతులు మిగులుండగానే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
టాస్ గెలిచిన బార్బడోస్ ట్రైడెంట్స్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 35 పరుగులు చేసాడు. అయితే స్కాట్ కుగ్గేలేన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఓపెనర్ షై హోప్ 3 బౌండరీలు బాది స్కోర్ వేగం పెంచే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. /అనంతరం కోరే ఆండర్సన్ పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు.
ఈ సమయంలో కైల్ మేయర్స్ అండతో కెప్టెన్ జాసన్ హోల్డర్ రెచ్చిపోయాడు. 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది ట్రైడెంట్స్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అదే ఊపులో భారీ షాట్ ఆడిన హోల్డర్ (27) కేస్రిక్ విలియమ్స్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ వేంటనే జోనాథన్ కార్టర్ (5), మేయర్స్ (16)ను రోస్టన్ చేజ్ ఔట్ చేయడంతో.. ట్రైడెంట్స్ కష్టాల్లో పడింది. ఇక రేమోన్ రీఫెర్ (1) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో అష్లే నర్స్ (16), మిచెల్ సాంట్నర్ (8) ఆదుకున్న్నారు. ఇదే సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. బార్బడోస్ 18.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో నర్స్ (16), సాంట్నర్ (8) ఉన్నారు.
భారీ వర్షం కారణంగా మ్యాచ్ చాలా సమయం నిలిచిపోయింది. అనంతరం డక్వర్త్ లూయిస్ పద్దతిలో సెయింట్ లూసియా లక్ష్యంను 5 ఓవర్లలో 47 పరుగులుగా అంపైర్లు నిర్ధారించారు. విండీస్ భారీకాయుడు, బాహుబలి రకీమ్ కార్న్వాల్ (14) ఆదిలోనే చెలరేగాడు. 8 బంతుల్లోనే మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. ఫ్లెచర్ (16), మొహమ్మద్ నబీ (15) బ్యాట్ జులిపించడంతో మరో ఐదు బంతులు మిగులుండగానే సెయింట్ లూసియా విజయం సాధించింది. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' నబీకి దక్కింది.