
తారౌబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సెమీస్ రేసు నుంచి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు నిష్క్రమించింది. సెయింట్ కిట్స్ కెప్టెన్ రాయద్ ఎమిరిట్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. స్టార్ ఓపెనర్లు ఎవిన్ లెవిస్, క్రిస్ లిన్ ఉన్నా.. పెద్దగా ఆకట్టుకోలేకయారు. జాషువా డా సిల్వా, బెన్ డంక్, దేనేష్ రామ్దిన్లు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఇక విండీస్ స్టార్ పేసర్ షెల్డన్ కాట్రెల్ వికెట్ తీయడానికి తంటాలు పడ్డాడు. మొత్తంగా సెయింట్ కిట్స్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది.
గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తల్లావాస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. దీంతో 9 మ్యాచులు ఆడిన సెయింట్ కిట్స్ 3 పాయింట్లతో సీపీఎల్ 2020 సెమీస్ నుంచి అధికారికంగా తప్పుకుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు మొత్తం 10 మ్యాచులు ఆడుతుంది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన సెయింట్ కిట్స్ కేవలం ఒక్క విజయం మాత్రమే అందుకుంది. ఏకంగా 7 మ్యాచులు ఓడిపోయింది. చివరి మ్యాచ్ సెప్టెంబర్ 6న ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టుతో ఆడనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సెయింట్ కిట్స్ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లెవిస్, క్రిస్ లిన్ పరుగుల వరద పారించారు. ఫిడేల్ ఎడ్వర్డ్స్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ బౌలింగ్లో ఇద్దరు ఓపెనర్లు బౌండరీల కోసం పోటీపడ్డారు. లెవిస్ రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాధగా.. లిన్ ఒక ఫోర్, రెండు సిక్సులు కొట్టాడు. దీంతో సెయింట్ కిట్స్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరి ధాటికి ఎడ్వర్డ్స్, ముజీబ్ చెరో రెండు ఓవర్లలో 15, 20 రన్స్ సమర్పించుకున్నారు.
ఎవిన్ లెవిస్, క్రిస్ లిన్ మంచి ఊపులో ఉండగా.. వరణుడు అడ్డుపడ్డాడు. భారీ వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. అంపైర్లు పలుమార్లు పిచ్ పరిశీలించినా.. మ్యాచ్ సాగేందుకు వీలుకాలేదు. దీంతో మంచును దఱు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి సెయింట్ కిట్స్ 5.4 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 46 పరుగులు చేసింది. ఎవిన్ లెవిస్ (21), క్రిస్ లిన్ (23) పరుగులు చేశారు.