
తరోబా (ట్రినిడాడ్): ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో గయానా అమెజాన్ వారియర్స్ బోణీ కొట్టింది. బుధవారం సెయింట్ కిట్స్ అండ్స్ పేట్రియాట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెయాడ్ ఎమ్రిట్ నేతృత్వంలోని గయానా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. విండీస్ స్టార్ ఆటగాళ్లు షిమ్రాన్ హెట్మైర్ హాఫ్ సెంచరీ (71; 44 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లు) బాది.. కీమో పాల్ నాలుగు వికెట్లు తీసి గయానా విజయంలో కీలక పాత్ర పోషించారు. మరోవైపు సెయింట్ కిట్స్ కెప్టెన్ ఎమ్రిట్ బౌలింగ్లో మూడు వికెట్లతో మెరిసినా.. బ్యాటింగ్లో ఎవరూ రాణించకపోవడంతో ఓటమిపాలైంది.
గయానా అమెజాన్ వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన సెయింట్ కిట్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఫోర్ సిక్స్ బాదిన ఆసీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ లిన్ నాలుగో ఓవర్ మొదటి బంతికే ఔట్ అయ్యాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ లెవిన్ ఎవిస్ బ్యాట్ జులిపించాడు. లిన్ ఉన్నంతసేపు నెమ్మదిగా ఆడిన ఎవిస్.. ఆ తర్వాత బౌండరీలతో రెచ్చిపోయాడు. మంచి ఊపులో ఉండగానే క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు. ఆపై గయానా బౌలర్ పాల్ విజృంభించడంతో సెయింట్ కిట్స్ బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. బెన్ డంక్ (29), ఎమ్రిట్ (17) మాత్రమే పరుగులు చేశారు. చివరికి సెయింట్ కిట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గయానా అమెజాన్ వారియర్స్ 17 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 131 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (10), చందర్పాల్ హేమరాజ్ (19) నిరాశపరిచినా.. హెట్మైర్ హాఫ్ సెంచరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒకవైపు సహచరులు ఔట్ అవుతున్నా.. ఒక్కడే క్రీజులో నిలబడి పరుగులు చేశాడు. విజయానికి ఇక 4 రన్స్ అవసరం అయిన దశలో హెట్మైర్ ఔట్ అయ్యాడు. ఆపై గ్రీన్, షెపర్డ్ జట్టుకు విజయాన్నందించారు. దీంతో గయానా టోర్నీలో బోణీ కొట్టింది. ట్రిన్బాగో నైట్రైడర్స్తో జరిగిన మొదటి మ్యాచులో గయానా ఓడిపోయిన విషయం తెలిసిందే.
సీపీఎల్ 2020లో జమైకా తలావాస్ కూడా బోణీ కొట్టింది. బుధవారం సెయింట్ లూసియా జౌక్స్తో జరిగిన మ్యాచ్లో జమైకా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. గ్లెన్ ఫిలిప్స్ (44), ఆసిఫ్ అలీ (47) రాణించడంతో 159 పరుగుల లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. లూసియా బౌలర్లలో కేవోకే విలియమ్స్ 2 వికెట్లు తీయగా.. ఎస్సీ కుగెలెయిన్, ఓసీ మెక్ కాయ్, ఆర్ఆర్ఎస్ కార్న్వాల్లు తలా 1 వికెట్ తీశారు. అంతకుముందు రొస్టన్ చేజ్ (52) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. జమైకా బౌలర్లలో వి పెర్మాల్, ముజీబ్ ఉర్ రహమాన్లకు చెరో 2 వికెట్లు దక్కాయి.