
హైదరాబాద్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ మ్యాచులు జరుగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సీపీఎల్ టీ20 8వ ఎడిషన్ జరగనుంది. ఈ టోర్నీలో విండీస్తో పాటు ఇతర దేశాల నుంచి పలువురు ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. మొత్తం 6 జట్లు తలపడనున్నాయి.
సీపీఎల్ 2020 మ్యాచులు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ట్రినిడాడ్ వేదికగా గత సీజన్ రన్నరప్ గయాన అమేజాన్ వారియర్స్, త్రీటైమ్ చాంపియన్స్ ట్రినిబాగో నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టైమింగ్స్, ప్రత్యక్ష ప్రసార వివరాలు ఓసారి తెలుసుకుందామా?!!. విండీస్ కాలమానం ప్రకారం తొలి మ్యాచ్ మంగళవారం ఉదయం 10 గంటలకు మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలు స్టార్ అవుతుంది. రెండో మ్యాచ్ సాయంకాలం 5:30 (విండీస్)కు ప్రారంభమవుతుంది. అదే భారత్లో మరుసటి రోజు (బుధవారం) ఉదయం 3 గంటలకు మొదలవుతుంది.
సీపీఎల్ 2020 టోర్నీలోని కొన్ని మ్యాచులు మధ్యాహ్నం 2:15కి స్టార్ (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:45 గంటలకు) కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మాత్రం సాయత్రం 5:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 2:30 గంటలకు) మొదలవనుంది. సీపీఎల్ 2020 మ్యాచులు అన్ని స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారం ఫ్యాన్కోడ్ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇక సీపీఎల్ 2020 కోసం 13 మంది హిందీ వ్యాఖ్యాతలను కరీబియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం ఎంపిక చేసింది. అందరూ కూడా భారత్కు చెందినవారే.
సీపీఎల్ 2020 టోర్నీ విజేతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తారు. అదే రన్నరప్కు అయితే 6.60 లక్షల డాలర్లను బహుమతిగా ఇస్తారు. 3వ స్థానంలో నిలిచిన వారికి 2.50 లక్షల డాలర్లను, 4వ స్థానంలో నిలిచిన వారికి ఒక లక్ష డాలర్లను అందజేయనున్నారు. ఇక ప్లేయర్లకు ప్రైజ్ మనీని 1.50 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. లాంగెస్ట్ సిక్స్ కొట్టిన వారికి 5వేల డాలర్లు ఇవ్వనున్నారు. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 2.16 మిలియన్ డాలర్లు. కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి.