
హైదరాబాద్: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండా ట్రినిడాడ్, టొబాగోలో ఈ సీజన్ మ్యాచులు జరుగనున్నాయి. వైరస్ వ్యాప్తి అనంతరం జరగనున్న ప్రైవేట్ లీగ్ ఇదే కావడం విశేషం. ఈ ఏడాది సీపీఎల్ టీ20 8వ ఎడిషన్ జరగనుంది. ఇందులో విండీస్తోపాటు ఇతర దేశాల నుంచి పలువురు ప్లేయర్లు కూడా పాల్గొంటున్నారు. మొత్తం 6 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి.
సీపీఎల్ 2020 కోసం 13 మంది హిందీ వ్యాఖ్యాతలను కరీబియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం ఎంపిక చేసింది. అందరూ కూడా భారత్కు చెందినవారే. అందులో స్టార్ వ్యాఖ్యాతలు సంజయ్ మంజ్రేకర్, ఆకాష్ చోప్రా, డీప్ దాస్గుప్తా, జతిన్ సప్రూలు ఉన్నారు. వీరితో పాటు అజయ్ మెహ్రా, గౌతమ్ గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, సంజయ్ బంగర్, ఆశిష్ నెహ్రా, అజిత్ అగర్కర్, రజత్ భాటియా, ఇక్బాల్ అబ్దుల్లా, ఉన్ముక్త్ చంద్ హిందీ వ్యాఖ్యాతలుగా ఎంపికయ్యారు.
సీపీఎల్ 2020 సీజన్లో ఆడేందుకు ట్రినిడాడ్, టొబాగోకు వెళ్లిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అఫిషియల్స్, ఆర్గనైజర్స్ అందరికి తాజాగా కరోనా నెగటీవ్ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం బయో బబుల్ వాతావరణంలో క్వారంటైన్లో ఉన్న వీరందరికి వరుసగా రెండోసారి పరీక్షలు నిర్వహించగా.. నెగటీవ్ అని తేలింది. దీంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ప్రారంభించాయి.
సీపీఎల్ 2020 టోర్నీ విజేతకు 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తారు. అదే రన్నరప్కు అయితే 6.60 లక్షల డాలర్లను బహుమతిగా ఇస్తారు. 3వ స్థానంలో నిలిచిన వారికి 2.50 లక్షల డాలర్లను, 4వ స్థానంలో నిలిచిన వారికి ఒక లక్ష డాలర్లను ఇస్తారు. ప్లేయర్లకు ప్రైజ్ మనీని 1.50 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. లాంగెస్ట్ సిక్స్ కొట్టిన వారికి 5వేల డాలర్లు ఇవ్వనున్నారు. టోర్నీ మొత్తం అన్ని ప్రైజ్ మనీ 2.16 మిలియన్ డాలర్లు. కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో మొత్తం 33 మ్యాచ్లు జరగనున్నాయి. గత సీజన్ రన్నరప్ గయాన అమేజాన్ వారియర్స్, త్రీటైమ్ చాంపియన్స్ ట్రినిబాగో నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్తో ఈ లీగ్ తెరలేవనుంది.