
తరౌబా (ట్రినిడాడ్): వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఆరంభం అయింది. ట్రిన్బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ టైటిల్ పోరు కోసం తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ట్రిన్బాగో కెప్టెన్ కీరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం పోలార్డ్ ఒక మార్పు చేశాడు. సునీల్ నరైన్ ఫైనల్ మ్యాచ్ ఆడడం లేదు. మరోవైపు సెయింట్ లూసియా జట్టు ఒక్క మార్పు కూడా చేయలేదు.
'మేము మంచి ఫామ్లో ఉన్నాం. మరో మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం. సునీల్ నరైన్ లేకపోవడం మాకు పెద్దలోటే. అందరికోసం మేము సీపీఎల్ 2020 టైటిల్ గెలుస్తాం. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల ముఖాల్లో చిరునవ్వులు లేవు. వారి ముఖంలో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తాం' అని ట్రిన్బాగో కెప్టెన్ పొలార్డ్ అన్నాడు. 'ఇది ఫైనల్. ప్రతి ఒక్కరూ సవాలుకు సన్నద్ధం కావాలి. మాకు జట్టుపై విశ్వాసం ఉంది. 2020 ఒక చెత్త సంవత్సరం. కప్ గెలిచిన జూక్స్ అభిమానుల్లో జోష్ నింపుతాం' అని సెయింట్ లూసియా సారథి డారెన్ సామీ తెలిపాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సెయింట్ లూసియా జూక్స్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. విండీస్ బాహుబలి, స్టార్ ఓపెనర్ రకీమ్ కార్న్వాల్ (8) త్వరగానే పెవిలియన్ చేరాడు. అకీల్ హోసిన్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాది కార్న్వాల్ మంచి ఊపులో ఉన్నాడు. అయితే అలీ ఖాన్ వేసిన రెండో ఓవర్ రెండో బంతికే కార్న్వాల్ బోల్డ్ అయ్యాడు. దీంతో 9 పరుగులకే సెయింట్ లూసియా తొలి వికెట్ కోల్పోయింది. మార్క్ డీయల్ (10) రెండు ఫోర్లు, ఆండ్రీ ఫ్లెచర్ (5) ఒక ఫోర్ బాది స్కోర్ బోర్డు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 25 రన్స్ చేసింది.
జట్లు:
ట్రిన్బాగో నైట్ రైడర్స్: లెండ్ల్ సిమన్స్, టియోన్ వెబ్స్టర్, టిమ్ సీఫెర్ట్, డారెన్ బ్రావో, కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, సికందర్ రాజా, అకీల్ హోసిన్, ఖారీ పియరీ, ఫవాద్ అహ్మద్, అలీ ఖాన్.
యింట్ లూసియా జూక్స్: రకీమ్ కార్న్వాల్, మార్క్ డీయల్, ఆండ్రీ ఫ్లెచర్, రోస్టన్ చేజ్, మొహమ్మద్ నబీ, నజీబుల్లా జాద్రాన్, జావెల్లె గ్లెన్, డారెన్ సామీ, స్కాట్ కుగ్గెలీజ్న్, కెస్రిక్ విలియమ్స్, జహీర్ ఖాన్.