హైదరాబాద్: వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేకపోయాడని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. కరీబియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్)లో భాగంగా నెవిస్ పాట్రియాట్స్ జట్టు ఓపెనర్ ఎవిన్ లూయిస్ సెంచరీ చేయకుండా పొలార్డ్ నో బాల్ వేశాడు.
అసలేం జరిగిందంటే..
ఒక్క పరుగు చేస్తే నెవిస్ పాట్రియాట్స్ జట్టు గెలుస్తుంది. అప్పటికే లూయిస్ 97 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 32 బంతుల్లో 97 పరగులు చేసిన లూయిస్ ఫోర్తో సెంచరీ సాధించి, జట్టుకు విజయాన్ని అందించాలని అనుకున్నాడు. అదే సమయంలో బౌలింగ్ చేస్తున్న పొలార్డ్ ఆ ఒక్క పరుగు ఇచ్చి లూయిస్ని సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు.
క్రీడాస్ఫూర్తిని మరిచిపోయి మరీ... పొలార్డ్ నో బాల్ వేశాడు. షార్ట్ పిచ్ బాల్ వేసి బంతిని చాలా ఎత్తులో బ్యాట్స్మన్కు అందకుండా వేశాడు. దీంతో అంపైర్ దానిని నోబాల్గా ప్రకటించాడు. దీంతో జట్టు విజయానికి అవసరమైన ఆ ఒక్క పరుగు రావడంతో పాట్రియాట్స్ జట్టు గెలిచింది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో పొలార్డ్ కావాలనే నోబాల్ వేసినట్లు అందరికీ స్పష్టంగా అర్థమైంది. అదే సమయంలో కామెంట్రీ చేస్తున్న డానీ మోరిసన్ కూడా పొలార్డ్ తీరును తప్పుబట్టాడు. పొలార్డ్ ఇలా చేయడం తనను చాలా అసంతృప్తికి గురి చేసిందని అతను అన్నాడు.