హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తగినంత సమయం లభించడంతో ఇంటి వద్ద ఎంజాయ్ చేస్తున్నాడు. జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా జూన్ 4వ తేదీన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఐపీఎల్కి ఛాంపియన్స్ ట్రోఫీకి మధ్య విరామం లభించడంతో కోహ్లీ వీలైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ తాజాగా తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. వీడియోలో కోహ్లీతో పాటు ఓ బాబు కౌబాయ్ అవతారంలో దర్శమిచ్చారు.
'కౌబాయ్స్ని కలవండి' అని కోహ్లీ ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారంతా ఖాళీ సమయాన్ని కోహ్లీ ఎంత ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ పదో సీజన్లో కోహ్లీ నేృతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెత్త ప్రదర్శన చేసి పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచింది.
ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు కేవలం మూడింటిలోనే విజయం సాధించి లీగ్ దశలోనే ఇంటికి చేరింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తమ స్థాయికి తగ్గుట్టుగా రాణించనందుకు విరాట్ కోహ్లీ ట్విటర్ ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.
'ప్రస్తుత సీజన్లో అభిమానుల ప్రేమ, మద్దతు నిజంగా చాలా గొప్పది. వచ్చే సీజన్లో పుంజుకుని బలంగా తిరిగొస్తాం' అని ట్వీట్ చేస్తూ కోహ్లీ ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.