
క్యాన్బెర్రా: ప్రస్తుతం క్రికెట్ ఆడే దేశాలన్నీ తీరిక లేని షెడ్యూల్ను గడుపుతున్నాయి. భారత జట్టు సహా ప్రధాన దేశాల జట్లన్నీ.. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 సిరీస్లతో తలమునకలై ఉన్నాయి. టీమిండియా.. ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో సిరీస్లను ఆడుతోంది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్లో టూర్ కొనసాగిస్తోంది. ఇక న్యూజిలాండ్ జట్టు.. ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ రెండు జట్లు తొలి వన్డే ఇంటర్నేషనల్.. ఎల్లుండి ఆరంభమౌతుంది. పాకిస్తాన్ మొన్నీ మధ్యే విండీస్తో సిరీస్ ఆడొచ్చింది.
ఇలా క్రికెట్ ఆడే దేశాలన్నీ టైట్ షెడ్యూల్ను ఎదుర్కొంటోన్నాయి. ఆయా జట్లన్నీ కూడా తమ సిరీస్లల్లో టీ20 మ్యాచ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నాయి. దీనికి ప్రధాన కారణం- టీ20 ప్రపంచ కప్ ముందుండటమే. అక్టోబర్ 16వ తేదీ నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కాబోతోంది. దీనికి ఆస్ట్రేలియా ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ టోర్నమెంట్ను ఆస్ట్రేలియా నిర్వహించబోతోండటం ఇదే తొలిసారి.

దీనికి కౌంట్డౌన్ మొదలైంది. ఇక మిగిలింది వంద రోజులు మాత్రమే. ఇవ్వాళ్టి నుంచి సరిగ్గా వందో రోజు టీ20 ప్రపంచకప్లో తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. ఫైనల్తో కూడా కలుపుకొని మొత్తం 45 మ్యాచ్లు ఉంటాయి ఈ టోర్నమెంట్లో. అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ దశ మ్యాచ్లు మొదలవుతాయి. తొలి మ్యాచ్లో శ్రీలంక-నమీబియా తలపడతాయి. గ్రూప్ దశలో మొత్తం 12 మ్యాచ్లు ఉంటాయి. శ్రీలంక, నమీబియా, వెస్టిండీస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్కాట్లాండ్ తలపడతాయి.
అదే నెల 22వ తేదీ నుంచి అసలు మ్యాచ్లు ఉంటాయి. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్లు జట్లు మలి గ్రూప్ దశలో తొలి రోజు తలపడతాయి. 23వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య పోరు ఉంటుంది. నవంబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ను షెడ్యూల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి ఆస్ట్రేలియా బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ ప్రొమో విడుదలైంది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.