
వన్డే సిరీస్ రద్దు:
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం ధర్మశాలలో తొలి వన్డే జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఒక్క బంతీ పడకుండానే మ్యాచ్ రద్దైంది. ఈ నెల 15న లక్నోలోని ఎకనా స్టేడియంలో రెండో వన్డే, 18న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో చివరి వన్డే జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతుండడంతో మొత్తం సిరీస్ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల క్షేమం కోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

సొంత దేశానికి సఫారీలు:
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్పై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షల్ని విధించింది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచులను నిర్వహించాలి ఆదేశించింది. నిన్నటి వరకు కూడా ఖాళీ స్టేడియాల్లో వన్డే సిరీస్ నిర్వహిస్తారని అందరూ భావించారు. కానీ.. కరోనా వైరస్ నిర్ధారిత కేసులు దేశంలో ఎక్కువవుతుండంతో.. వాటాదారులతో (స్టేక్ హోల్డర్స్) సంప్రదించిన తరువాత బీసీసీఐ మిగిలిన రెండు వన్డే మ్యాచ్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు సొంత దేశానికి పయనమవనుంది.

ఐపీఎల్ వాయిదా:
కరోనా కాటుతో శుక్రవారమే ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడింది. కనీసం రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఫ్రాంచైజీలు కోరడంతో అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్ 15 నుంచి లీగ్ను ఆరంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని ఫ్రాంచైజీలకు చేరవేసినట్టు సమాచారం. షెడ్యూలు ప్రకారం మార్చి 29 నుంచి లీగ్ ఆరంభం కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, దౌత్య మినహా అన్ని విభాగాల వీసాలను ఏప్రిల్ 15 వరకు నిషేధించడం, భారీగా జనాలు గుమిగూడటాన్ని అడ్డుకోవాలని బీసీసీఐ సహా దేశంలోని అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేయడంతో ఐపీఎల్ వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా అభిమానులు మరికొన్ని రోజులు భారత్లో క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కోల్పోనున్నారు.


Click it and Unblock the Notifications












