
ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు నో ఎంట్రీ
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 4 వేల మందికి పైగా మృతిచెందారు. ఇక భారత్లో కూడా వేగంగా వ్యాప్తిచెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 73 కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో.. భారత ప్రభుత్వం విదేశీ వీసాలపై కఠిన నిబంధనలు జారీ చేసింది. కేవలం దౌత్య సంబంధిత, వర్క్ వీసాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు కావు. దీంతో అప్పటివరకు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో కనిపించే అవకాశం లేదని సమాచారం.

ఐపీఎల్ను వాయిదా వేస్తే
గురువారం బీసీసీఐకి చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ... 'ఐపీఎల్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు వాణిజ్య సంబంధిత వీసాలు జారీ చేస్తారు. ఐపీఎల్ నిర్వహణపై గవర్నింగ్ కౌన్సిల్ ఈనెల 14న ముంబైలో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనా శనివారం విషయం తెలియజేస్తాం. ఒకవేళ ఐపీఎల్ను వాయిదా వేస్తే.. ఏప్రిల్, మే తర్వాత విదేశీ ఆటగాళ్లు భారత్కు వచ్చే అవకాశం లేదు. జాతీయ జట్లన్నింటికీ ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. ఐపీఎల్ను నిర్వహించాలంటే అభిమనులను స్టేడియంలోకి అనుమతించకుండా ఆడించడమే సరైన మార్గంగా కనిపిస్తోంది' అని అన్నారు.

ప్రేక్షకులు లేకుండానే వరల్డ్ సిరీస్
మరోవైపు పూణెలో కరోనా కేసులు నమోదవ్వడంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్పై ఆంక్షలు విధించారు. గురువారం నుంచి ప్రేక్షకులు లేకుండానే ఈ టోర్నీ జరగనుంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ శత జయంతి సందర్భంగా బంగ్లాదేశ్ ఘనంగా నిర్వహించాలనుకున్న ఆసియా XI, ప్రపంచ XI టీ20 మ్యాచులు కూడా వాయిదా పడ్డాయి.

14న తుది నిర్ణయం
'ప్రస్తుతం మేము కరోనా వైరస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నాం. శనివారం ఐపీఎల్ పాలక మండలి సభ్యుల సమావేశం జరగనుంది. ఐపీఎల్ 2020పై తుది నిర్ణయం తీసుకుని సమాచారం అందిస్తాం' అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 29న ముంబైలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ మొదలు కానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












